సిరా న్యూస్,విజయవాడ;
విజయవాడ పార్లమెంట్ స్థానం నంచి తెలుగుదేశం పార్టీ వేరే అభ్యర్థిని నిలబెడుతుందని ఈ సారికి టిక్కెట్ లేదని సిట్టింగ్ ఎంపీ కేశినేని నానికి హైకమాండ్ స్పష్టత ఇచ్చింది. పార్టీ వ్యవహారాలలో పెద్దాగ జోక్యం చేసుకోవద్దని కూడా సలహా ఇచ్చింది. నిజానికి టీడీపీ హైకమాండ్ ఇలా ఎన్నికలకు రెండు, మూడు నెలల ముందు ఎవరికీ చెప్పదు. కానీ కేశినేని నానికి మాత్రం చెప్పింది. ఈ అంశం పార్టీలో కలకలం రేపుతోంది. తిరువూరు సభ బాధ్యతను పార్టీ కేశినేని చిన్నికి ఇచ్చిన తర్వాత అక్కడ సభా ఏర్పాట్లపై కేశినేని చిన్న ఏర్పాటు చేసిన సమావేశానికి నాని వెళ్లారు. అక్కడి విషయాలు పరిధి దాటిపోయాయి. దీంతో ఏదో ఒకటి తేల్చకపోతే ఇలాంటి సమస్యలు పెరిగిపోతాయన్న ఉద్దేశంతో వెంటనే టీడీపీ హైకమాండ్ నిర్ణయం తీసుకున్నట్లుగా కనిపిస్తోంది. కేశినేని నాని వ్యవహారశైలిపై మొదటి నుంచి టీడీపీ హైకమాండ్కు అసంతృప్తి కలిగిస్తూనే ఉంది. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆయన వ్యవహరించిన తీరు.. చంద్రబాబు మాటలను కూడా పట్టించుకోకపోవడం వంటివి హైలెట్ అయ్యాయి. కేశినేని ట్రావెల్స్ వ్యాపారాన్ని మూసివేసే విషయంలో ఆయన వ్యవహరించిన తీరు చంద్రబాబును నొప్పించిందని చెబుతారు. అయితే రాష్ట్ర విభజన సమయంలో జరిగిన ఉద్యమాల సమయంలో ఆయన పనితీరుతో చంద్రబాబు అలాంటి మైనస్లను పక్కకు పెట్టి టిక్కెట్ కేటాయించారు. అయితే పార్టీ ఓడిపోయిన తర్వాత ఆయన తీరు మరింత మైనస్ అయింది. పలుమార్లు చంద్రబాబుకు వ్యతిరేక వ్యాఖ్యలు చేశారు. ఓ సారి ఢిల్లీలో బోకే ఇవ్వమని ఇచ్చినా విసిరికొట్టారు. మీడియా లో అలాంటివి చాలా సార్లు హైలెట్ అయ్యాయి. అయితే పార్టీ పరంగా ఆయనను ఎప్పుడూ దూరంగా ఉంచలేదు. కేశినేని వ్యవహారశైలి తీవ్రంగా వివాదాస్పదమయినప్పుడే నాని ఇంటిలో ఆయన కుమార్తె వివాహ రిసెప్షన్ కార్యక్రమం లో పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కుటుంబంతో సహా హాజరయ్యారు. ఆ తర్వాత టీడీపీలో ఆయన సోదరుడు కేశినేని శివనాథ్ను ప్రోత్సహించడంతో ఆయన మరింతగా ఫైర్ అవుతున్నారు. మధ్యలో ఇండిపెండెంట్ గా పోటీ చేస్తానంటూ పెద్ద పెద్ద మాటలు కూడా చెప్పారు. ఇవన్నీ ఆయనకు మైనస్గా మారాయి.చంద్రబాబుపై సానుకూలంగా ఉన్న కేశినేని నాని లోకేష్ నాయకత్వాన్ని పూర్తిగా విస్మరించారు. ఆయన గురించి అసలు ఎప్పుడూ మాట్లాడలేదు. తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి జరిగినప్పుడు స్పందించలేదు. లోకేష్ నిర్వహించిన యువ గళం పాదయాత్రకు సైతం పార్లమెంట్ సభ్యుడుగా ఉన్న కేశినేని నాని హజరు కాలేదు. టీడీపీ బెజవాడ ఎంపీ కేశినేని నాని లోకేష్ పాదయాత్రలో పాల్గొనలేదు. తెలుగు దేశం పార్టీకి ఉన్నదే ముగ్గురు పార్లమెంట్ సభ్యులు . అందులో బెజవాడ పార్లమెంట్ సభ్యుడు కేశినేని నాని ఒకరు. అయితే ఆయన వ్యవహర శైలి పార్టీకి మెదటి నుండి తలనొప్పిగానే మారింది. అయితే ఇప్పుడు ఏకంగా లోకేష్ నిర్వహించిన యువరగళం పాదయాత్రకు కనీసం ముఖం కూడా చూపించ లేదు. ఎన్టీఆర్ జిల్లా పరధిలో జరిగిన లోకేష్ పాదయాత్రలో పార్లమెంట్ సభ్యుడి హోదాలో ఉన్న కేశినేని నాని అసలు పాల్గొనకపోవడంపై టీడీపీలో విస్తృత చర్చ జరుగింది. కనీసం పలకరింపుగా కూడ ఆయన రాలేదు. పాదయత్ర, లోకేష్, యువగళం వంటి పేర్లు నాని నోటి వెంట రాలేదు. తర్వాత చంద్రబాబు నిర్వహించిన బాదుడే బాదుడు కార్యక్రమం విజయవాడలో జరిగిన సమయంలో కూడ కేశినేని నాని దూరంగా ఉన్నారు. ఇలా వరుసగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండటం, అధికారికంగా నిర్వహించే కార్యక్రమాల్లో అధికార పార్టీకి చెందిన నాయకులతో కలసి పాల్గొనటం, అధికారులను వెంట పెట్టుకొని నాని ముందుకు వెళ్ళటంపై అనేక చర్చలు జరిగాయి. సాధారణంగా పార్టీలో జరిగే కార్యక్రమాల్లో కీలక నేతలు ముందుండి నడిపించటం ఆనవాయితీ. అయితే ఇప్పుడున్న రాజకీయ పరిస్దితుల్లో అయితే, పార్లమెంట్ సభ్యుడికి ప్రత్యేక స్దానం ఉంటుంది. పార్టీకి చెందిన పార్లమెంట్ సభ్యుడిగా ఉండి కూడ పార్టీలో చంద్రబాబు తరువాత అంతటి స్దాయి ఉన్న లోకేష్ నిర్వహించిన పాదయాత్రలో కేశినేని నాని హజరు కాకపోగా.. పార్టీ కార్యక్రమాలను సరిగ్గా నిర్వహించలేదన్న ఆరోపణలు ఉన్నాయి. యువగళం పాదయాత్రను టీడీపీ ఎంత సీరియస్గా తీసుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అలాంటి కార్యక్రమాన్ని పట్టించుకోకపోతే ఇక ఆయనకు విలువ ఇవ్వాల్సిన అవసరం ఏమి ఉంటుందని టీడీపీ పెద్దల్లో చర్చ జరిగింది.