మెట్రో ప్లాన్‌తో..

రంగారెడ్డి జిల్లాలో భూముల ధరలకు రెక్కలు
 సిరా న్యూస్,హైదరాబాద్;
ఎల్బీనగర్‌-హయత్‌నగర్‌ మెట్రో కల.. త్వరలోనే సాకారం కానుంది. మరోవైపు హయత్‌నగర్‌ మెట్రో ప్లాన్‌తో.. రంగారెడ్డి జిల్లాలో భూముల ధరలకు రెక్కలొచ్చాయి. తొలుత ఐటీ కంపెనీల రాకతో భూముల విలువ అమాంతం పెరిగింది. ఇక రీజినల్‌ రింగ్‌ రోడ్డు వల్ల జిల్లాలో భూములు బంగారం అవుతాయనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అయితే ఎక్కడా లేనివిధంగా 100 కోట్ల రూపాయలు పలుకుతున్న భూమి కేవలం ఈ జిల్లాలోనే ఉన్నట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి.
హయత్ నగర్‌కు మెట్రోతో.. రంగారెడ్డి జిల్లాకు మహార్దశ పట్టబోతోంది. మెట్రో రైలు విస్తరణకు సంబంధించి అన్ని ప్రణాళికలు పూర్తయ్యాయి. సైబరాబాద్‌ను న్యూయార్క్‌తో పోటీపడేలా తీర్చిదిద్దుతామని సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. ఇప్పటికే శివారు ప్రాంతాల్లో ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. ఇక ప్రఖ్యాతిగాంచిన రామోజీ ఫిలింసిటీ సైతం ఇక్కడే ఉండటంతో పర్యాటకులకు, సినిమా వాళ్లకు మెట్రో ఎంతో ఉపయోగపడుతుంది. రాచకొండ ప్రాంతాన్ని అద్భుతమైన ఫిలిం ఇండస్ట్రీగా మారుస్తామని సీఎం హామీ ఇచ్చారు.హయత్‌నగర్‌ మెట్రో ప్లాన్‌ ఎప్పటి నుంచో ఉంది. ఎల్బీనగర్‌ వరకే మెట్రో ఉండటంతో అక్కడి నుంచి వెళ్లాలంటే ట్రాఫిక్‌ కష్టాలు దారుణంగా ఉన్నాయి. ఎందుకంటే.. మెట్రో దిగాక బస్సు ఎక్కాలంటే చాలా దూరం నడిచి ముందుకు రావాల్సి వస్తోంది. అంతేకాకుండా 4 రోడ్ల కూడలి వల్ల వాహనాల రద్దీతో నడిచి వెళ్లాలంటే కష్టంగా ఉంటోంది. అందులోనూ హయత్‌నగర్‌లో మధ్యతరగతి వాళ్లు, కూలీ పనులకు వెళ్లేవాళ్లు ఉండేందుకు అనువుగా ఉంటుంది. సో చాలా మంది అక్కడి నుంచే సిటీకి వెళ్తుంటారు. ఒక్కోసారి ఆటోలు, బస్సులు అందుబాటులో లేక నానా అవస్థలు పడుతున్నారు. వీటిన్నింటిని దృష్టిలో పెట్టుకున్న రేవంత్‌ సర్కార్‌ వీలైనంత త్వరగానే మెట్రో పూర్తి చేసేలా ప్లాన్‌ చేస్తోంది.
====================

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *