సిరా న్యూస్, పెంబి:
అప్పుల భాధతో యువ రైతు ఆత్మహత్య…
+ చందు నాయక్ తండాలో దారుణం
+ పురుగుల మందు తాగిన రైతు గుగ్లావత్ శ్రీకాంత్
+ కేసు నమోదు చేసిన పోలీసులు
నిర్మల్ జిల్లా పెంబి మండలం పరిదిలోని చందు నాయక్ తండాకు చెందిన గుగ్లావత్ శ్రీకాంత్(24) అనే యువ రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడినట్లు స్థానికులు, పోలీసులు తెలిపారు. వారి కథనం ప్రకారం, శ్రీకాంత్ తన 1.5 ఎకరాల చేన్లో పత్తి పంట వేసాడు. ఈ ఏడాది వానాకాలంలో భారీ వర్షాలకు పత్తి పంట పూర్తిగా నీట మునిగింది. దీంతో అప్పటి నుంచి ఆయన ముభావంగా ఉంటున్నాడు. పంట పూర్తిగా నష్టపోవడంతో తన సోదరీమణుల పెండ్లి కోసం చేసిన అప్పులు ఎలా తీర్చాలో అర్థం కావడం లేదంటూ, తెలిసిన వాళ్ల దెగ్గర తరుచుగా చెబుతూ బాధపడేవాడు. ఈ క్రమంలో గత రెండు నెలలుగా తాగుడుకు బానిసయ్యాడు. శనివారం ఉదయం ఇంట్లో ఎవరూ లేని సమయంలో మద్యం మత్తులోనే గుర్తు తెలియని పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇంటికి వచ్చిన భార్య శ్రీకాంత్ను ఖానాపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. కాగా మృతుడి తల్లిదండ్రులు గతంలోనే చనిపోయారు. మృతుడు తన భార్యతో కలిసి ఉండేవాడని, సంతానం మాత్రం లేరని స్థానికులు తెలిపారు. కాగా శ్రీకాంత్ భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు ప్రారంభించినట్లు ఎస్సై రజనీకాంత్ తెలిపారు.