రంగంలోకి వైఎస్ ఫ్యామిలీ

సిరా న్యూస్,కడప;
ఏపీలో ఎన్నికల ప్రచారం జోరందుకుంది. నామినేషన్ల ఉప సంహరణ పూర్తి కావడంతో బరిలో ఉన్న అభ్యర్థుల లెక్క తేలిపోయింది. దీంతో అభ్యర్థులు తమ తమ నియోజక వర్గాల్లో ప్రచారం ప్రారంభించారు. అయితే ఈ సారి అందరి చూపులు కడప జిల్లా పులివెందులపైనే ఉన్నాయి. సీఎం జగన్ ప్రాతినిధ్యం వహించే ప్రాంతం కావడంతో పాటు కడప నుంచి వైఎస్ షర్మిల ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు.గతంలో ఎన్నడూ లేనంత ప్రత్యేకత కడప జిల్లా సొంతమైంది. వైఎస్ కుటుంబ సభ్యులే ప్రత్యర్థులుగా సాగుతున్న ఈ ఎన్నికల్లో ఎన్నడూ ఇళ్లు విడిచి బయటకు రాని వారు కూడా ఇళ్లు దాటి బయటకు రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో పులివెందుల రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. గతంలో పులి వెందులలో వార్ వన్ సైడ్ గా సాగేది.వైఎస్ కుటుంబ సభ్యులు ఎన్నికల్లో పోటీ చేస్తే పోటీ నామమాత్రంగా ఉండేది. దీంతో నియోజకవర్గంలో పోటా పోటీ ప్రచారం కనిపించేది కాదు. కానీ ఈ సారి సీఎం జగన్ పోటీ చేయడం, కడప ఎంపీ అభ్యర్థిగా చెల్లెలు షర్మిల బరిలోకి దిగడంతో ఇరువురి పోటీ ఆసక్తిని రేకెత్తిస్తోంది. పులివెందుల అసెంబ్లీ స్థానం కడప లోక్ సభ పరిధిలోకి రావడంతో షర్మిల పులివెందులలో ప్రచారం చేయాల్సి ఉంటుంది.సహజంగానే కాంగ్రెస్ అసెంబ్లీ అభ్యర్థుల తరపున షర్మిల ప్రచారం చేయడమే కాకుండా స్వయంగా తానే పోటీకి దిగడంతో ప్రత్యర్థి పార్టీ అంటే.. జగన్ కు ఓటు వేయొద్దని చెప్పాల్సి వస్తోంది. అయితే తాము అభిమానించే కుటుంబం నుంచి ఇద్దరు ఎన్నికల బరిలో నిలవడంతో ఎవరి వెంట నడవాలో..ఎవరికి ఓటు వేయాలో అన్న అయోమయంలో జనం ఉన్నట్లు సమాచారం.ఇదిలా ఉంటే వీరిద్దరి తరుపున కుటుంబ సభ్యులు రంగంలోకి దిగారు. జగన్ తరపున ఆమె భార్య భారతి ప్రచారం చేస్తుంటే.. షర్మిల తరపున వివేకానంద రెడ్డి కూతురు సునీత ప్రచారం చేస్తున్నారు. ప్రచారంలో జగన్ ను టార్కెట్ చేస్తూ సునీత విమర్శల వర్షం కురిపిస్తున్నారు. జగన్ పై విమర్శలు చేయడంతో సునీత వైసీపీ కార్యకర్తల నుంచి ఇబ్బందులను ఎదుర్కుంటున్నారు. అయినప్పటికీ వాటిని లెక్కచేయకుండా ప్రచారంలో దూసుకుపోతున్నారు సునీత.
=======================

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *