సిరా న్యూస్, జైనథ్:
చిన్నారులకు పోలియో చుక్కలు తప్పనిసరిగా వేయించాలి
– జడ్పిటిసి తుమ్మల అరుంధతి వెంకటరెడ్డి
– భోరజ్ లో పోలియో చుక్కల కార్యక్రమం ప్రారంభం
అప్పుడే పుట్టిన పసిపిల్లల నుండి 5 సంవత్సరాల లోపు చిన్నారులకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని జైనథ్ జడ్పిటిసి తుమ్మల అరుంధతి వెంకటరెడ్డి అన్నారు. ఆదివారం ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలంలోని భోరజ్ గ్రామంలో పోలియో చుక్కల కార్యక్రమాన్ని అధికారులు, నాయకులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… చిన్నారులకు అంగవైకల్యం సోకకుండా ఉండాలంటే తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని సూచించారు. పోలియో చుక్కల గురించి ఎలాంటి అపోహాలకు పోకుండా ప్రతి ఒక్కరు తమ చిన్నారులకు పోలియో చుక్కలు వేయించాలన్నారు. ఏదైనా కారణం వల్ల పోలియో చుక్కలు వేయించుకొని చిన్నారులకు సోమ, మంగళవారాల్లో వైద్య సిబ్బంది ఇంటింటికి తిరుగుతూ చుక్కలు వేయడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎంపీటీసీ కట్కర్ల మహేందర్ రెడ్డి, ఏఎన్ఎం హేమలత, స్థానిక నాయకులు ఉన్నారు.