భారీగా తగ్గని రియల్…
సిరా న్యూస్,హైదరాబాద్;
హైడ్రా… ఇప్పుడు తెలంగాణతోపాటు దేశంలో ఎక్కడ చూసినా ఈ అంశంపైనే చర్చ జరుగుతోంది. హైదరాబాద్ నగరంలోని చెరువులు, నాలాలు, ప్రభుత్వ భూములను ఆక్రమించిన వారి ఆట కట్టించేందుకు తెలంగాణ ప్రభుత్వం రెండు నెలల క్రితం హైడ్రాను ఏర్పాటు చేసింది. వెంటనే రంగంలోకి దిగిన హైడ్రా గ్రేటర్ హైదరాబాద్ లో చెరువుల ఆక్రమణదారుల గుండెళ్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. బడాబాబులు మొదలు సామాన్యుల వరకు చెరువులను ఆక్రమించి కట్టిన కట్టడాలన్నింటిని నేలమట్టం చేస్తోంది హైడ్రా.ఈ క్రమంలో ఇప్పటివరకు సుమారు 100 ఎకరాల ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకున్నట్లు ప్రకటించింది హైడ్రా. ఈ పరిస్థితుల్లో హైడ్రాకు మరిన్ని అధికారులు కట్టబెట్టడంతోపాటు న్యాయపరమైన చిక్కులు ఎదురుకాకుండా చట్టబద్దత కల్పించాలని నిర్ణయించింది ప్రభుత్వం. హైదరాబాద్, చుట్టుపక్కల ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ రంగం పూర్తిగా పడిపోయింది. ఆస్తులు కొనాలంటే ప్రతిఒక్కరూ భయపడిపోతున్నారు. దాంతో నిర్మాణ రంగం పూర్తిగా మందగమనంలోకి పడిపోయింది. చాలా వరకు సర్వేలు కూడా ఇదే విషయాన్ని వెల్లడిస్తున్నారు. అక్రమ లే అవుట్లతో ప్రజలు ఆగం కాగా.. ఇప్పుడు కొనేందుకు ఎవరూ పెద్దగా ఆసక్తి చూపడం లేదు. కోట్ల రూపాయలు పెట్టి కొనుగోలు చేస్తే ఎప్పుడు ఎలాంటి నోటీసులు అందుకోవాల్సి వస్తుందోనని ఆందోళనలతో ఉన్నారు..ఐతే క్యాబినెట్ భేటీలో హైడ్రాపై చర్చ సందర్భంగా మంత్రుల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమైనట్లు తెలుస్తోంది. హైడ్రాపై ప్రజల్లో ఓవైపు ప్రశంసలు వస్తుండగా.. మరోవైపు వ్యతిరేకత వ్యక్తమవుతోందని కొందరు మంత్రులు సీఎం దృష్టికి తీసుకువెళ్లినట్లు సమాచారం. మరీ ముఖ్యంగా హైడ్రా పనితీరుపై సామాన్యుల్లో ఆందోళనలను ఒకరిద్దరు మంత్రులు సీఎం రేవంత్ రెడ్డికి చెప్పారట.హైడ్రా ఏర్పాటు తర్వాత.. రిజిస్ట్రేషన్ల ద్వారా సమకూరే ప్రభుత్వ ఆదాయం తగ్గిపోయిందనే విషయాన్ని కూడా ప్రస్తావించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ పై హైడ్రా తీవ్ర ప్రభావం చూపుతోందని, హైడ్రా ఎఫెక్ట్ తో గ్రేటర్ లో నిర్మాణ రంగం పూర్తిగా దెబ్బతింటుందేమోననే అభిప్రాయాన్ని కొందరు మంత్రులు కేబినెట్ సమావేశంలో వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.హైడ్రా దూకుడు ప్రభావం రిజిస్ట్రేషన్లపై స్పష్టంగా కనిపిస్తోందని మంత్రివర్గం సమావేశంలో ఓ సీనియర్ మంత్రి గుర్తు చేశారని తెలుస్తోంది. హైడ్రా ఎఫెక్టుతో ఆగస్టులో సుమారు 400 కోట్ల రూపాయల రిజిస్ట్రేషన్ల ఆదాయం తగ్గిందని సదరు మంత్రి ఆవేదన వ్యక్తం చేశారట. హైడ్రా పనితీరుతో గ్రేటర్ హైదరాబాద్ లో నిర్మాణ సంస్థలు, బిల్డర్లు కొత్త నిర్మాణాలపై అనుమతులు తీసుకోవడానికి జంకుతున్నారన్న విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారట మరో సీనియర్ మంత్రి.ఇలాంటి సమయంలో హైడ్రాకు మరిన్ని అధికారాలు కట్టబెట్టి, చట్టబద్దత కల్పిస్తే పరిస్థితి మరింత దిగజారే ప్రమాదం ఉందని ఒకరిద్దరు మంత్రులు క్యాబినెట్ సమావేశంలో ఆందోళన వ్యక్తం చేశారని సమాచారం. హైడ్రా మంచి ఉద్దేశ్యంతో ఏర్పాటు చేసినా, అది ప్రభుత్వ భూములను రక్షిస్తున్నా.. అదే సమయంలో ఎదురవుతున్న ప్రతికూలతలను సైతం పరిగణలోకి తీసుకోవాలని మంత్రులు సూచించారని తెలుస్తోంది. హైడ్రాపై మంత్రివర్గ సహచరుల అభిప్రాయాలు, సూచనలను సావదానంగా విన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. అంతే సూటిగా స్పష్టంగా సమాధానం చెప్పారని సమాచారం.రాష్ట్రంలో హైదరాబాద్లోనే రియల్ వ్యాపారంతో ఆదాయం ఎక్కువ. రిజిస్ట్రేషన్లు ఎన్ని జరిగితే ప్రభుత్వానికి అంతలా ఆదాయం పెరుగుతుంది. కానీ.. హైడ్రా ఎఫెక్ట్తో రిజిస్ట్రేషన్లు చాలా వరకు తగ్గిపోయాయి. దాంతో ప్రభుత్వ ఆదాయం కూడా కాస్త మందగించినట్లుగానే తెలుస్తోంది. నిజానికి ఏటా దసరా, దీపావళి వేళ హైదరాబాద్లో ఇళ్లు సేల్స్ ఎక్కువగా కనిపిస్తాయి. చాలా మంది ఇళ్లు కొనాలనుకునే వారు ఈ రెండు పండుగలను బేస్ చేసుకొని కొంటుంటారు. కానీ.. ప్రస్తుత పరిస్థితులు అలా కనిపించడం లేదు. కొత్త ఇల్లు కొనేందుకు ఎవరూ సాహసించడం లేదు. ఈ పరిస్థితి ఇలానే కొనసాగితే కరోనా సమయంలోని పరిస్థితులనే చూడాల్సి వస్తుందని పలువురు నిపుణులు అభిప్రాయపడుతున్నారు.మరోవైపు.. రేవంత్ రెడ్డి సర్కార్ ముందు కూడా ఎన్నో లక్ష్యాలు ఉన్నాయి. ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేయాల్సి ఉంది. అటు.. గత ప్రభుత్వం చేసిన అప్పులనూ మోయాల్సి ఉంది. కానీ.. ఈ సమయంలో ఆయన హైడ్రాను తీసుకురావడం కూడా సంచలనంగా మారింది. హైదరాబాద్ నగరంలో 42 శాతానికి ఇళ్ల అమ్మకాలు పడిపోయాయంటే ముందుముందు మరిన్ని భయంకర పరిస్థితులు తప్పవేమో అన్న అభిప్రాయాలూ వినిపిస్తున్నాయి. వీటన్నింటిని కాదని రేవంత్ సర్కార్ కూడా ఎలా ముందుకు వెళ్తుందా అనేది ప్రశ్నార్థకంగా మారింది. ప్రస్తుత పరిస్థితుల్లో హైడ్రాపై ఏ మాత్రం వెనక్కి తగ్గేది లేదని, ఆ సంస్థకు పూర్తిస్థాయి అధికారాలు కట్టబెట్టి, చట్టబద్దత కల్పించడంలో వెనకడుగు వేసేదే లేదని తేల్చి చెప్పినట్లు తెలుస్తోంది. ఏళ్ల తరబడి ఆక్రమణలకు గురైన చెరువులను, కుంటలను కాపాడటంలో రాజీపడే ప్రసక్తే లేదని, ఓ మంచి పని చేసే సమయంలో కొంత నష్టం తప్పదని మంత్రులకు సర్ది చెప్పే ప్రయత్నం చేశారట సీఎం రేవంత్ రెడ్డి.హైడ్రా ముఖ్య ఉద్దేశం, భవిష్యత్తు తరాలకు జరిగే మంచి గురించి ప్రతి సందర్భంలోను ప్రజలకు అర్థమయ్యేలా ప్రచారం చేయాలని మంత్రులకు ముఖ్యమంత్రి రేవంత్ సూచించినట్లు సమాచారం. మొత్తానికి హైడ్రాపై రియల్ ఎస్టేట్ ఆదాయం తగ్గినా.. ముఖ్యమంత్రి మాత్రం భవిష్యత్ తరాల బాగు కోసం ఏ త్యాగమైనా చేయాల్సిందేనని తేల్చి చెప్పారట. దీంతో మంత్రులు కూడా ఇంక చేసేదేమీ లేక హైడ్రాకు జైకొట్టారని టాక్.