సిరా న్యూస్,శ్రీకాకుళం;
శ్రీకాకుళం జిల్లాలోని నరసన్నపేట నియోజకవర్గం.. ఈ నియోజకవర్గానికి ప్రస్తుతం మాజీ డిప్యూటీ సి.ఎం ధర్మాన కృష్ణదాసు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిచిన కృష్ణదాసుకు ఈ సారి మాత్రం గడ్డు పరిస్ధితిని ఎదుర్కోకతప్పటం లేదు. జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఉన్న కృష్ణదాసుకు సొంత పార్టీ నుంచే ఊహించని అసమ్మతి ఎదురౌతోంది. నిన్న మొన్నటి వరకూ తన అనుకున్న నేతలంతా ఇపుడు కృష్ణదాసు పేరు చెబితేనే కారాలు మిరియాలు నూరుతున్నారు. ఇన్నాల్లూ నివురు గప్పిన నిప్పులా ఉన్న నరసన్నపేట అధికార పార్టీలోని అసమ్మతి స్వరం ఒక్క సారిగా రాజుకుంది.
వాస్తవానికి కృష్ణదాసు సి.ఎం జగన్ కు అత్యంత విశ్వాసపాత్రుడిగా పేరుంది. వైసిపి ఆవిర్భావ సమయంలో సోదరుడు ధర్మాన ప్రసాధరావును ఎదిరించి జగన్ తో నడిచారు కృష్ణదాసు. అయితే జగన్ విశ్వాసాన్ని పొందిన కృష్ణదాసు తన నియోజకవర్గంలోని సొంత పార్టీ నేతల విశ్వాసాన్ని మాత్రం పొందలేకపోతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో నియోజకవర్గంలోని తన యాంటీ బ్యాచ్ చేస్తున్న కార్యక్రమాలు కృష్ణదాసును ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. నియోజకవర్గంలో గతంలో ఉన్నడూ లేని విధంగా అసమ్మతి పెరిగిపోయింది. కృష్ణదాసు తీరుపై సొంత పార్టీ నేతలు బహిరంగానే విమర్శలు గుప్పిస్తున్నారు.
ఎమ్మెల్యే కృష్ణదాసు తీరుపై గుర్రుగా ఉన్న అసమ్మతి నేతలంతా ఏకత్రాటిపైకి వచ్చారు. నియోజకవర్గ కేంధ్రంలోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాలులో కృష్ణదాసుకు వ్యతిరేకంగా సమావేశం నిర్వహించారు. ఈ సమావేసానికి నియోజకవర్గంలోని నరసన్నపేట, పోలాకి, సారవకోట, జలుమూరు మండలాల నుంచి పెద్ద ఎత్తున్న ద్వితీయ శ్రేణి,తృతీయ శ్రేణి నేతలు హాజరయ్యారు. ఇద్దరు ఎం.పి.పిలు, ఒక జెడ్పీటీసీతో పాటు వెలమ కార్పోరేషన్ చైర్మన్, మాజీ డిసిసిబి చైర్మన్ వివిధ గ్రామాల సర్పంచులు, ఎం.పి.టి.సిలు సమావేశంలో పాల్టొన్నారు. ఇక ఆలోచిస్తే ఇబ్బందలు తప్పవనుకున్నారో ఏమో తెలియదు కానీ సమావేశానికి హాజరైన నేతలంతా కృష్ణదాసు వ్యవహార శైలిని తీవ్రంగానే తప్పుపట్టారు. అక్కడితో ఆగకుండా వచ్చే ఎన్నికల్లో కృష్ణదాసుకు టికెట్ ఇస్తే ఓడిస్తామని అల్టిమేటం జారీ చేసారు. మరోవైపు సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను పార్టీ హైకమాండ్ దృష్టికి తీసుకువెళ్లాలని అసమ్మతి నేతలంతా నిర్ణయించుకున్నారు. పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న కృష్ణదాసుపై ఇంతటి అసమ్మతి కనిపించటం ఇదే మొదటి సారి. దానికి తోడు నియోజకవర్గంలోని కీలక నేతలతో పాటు ప్రజా ప్రతినిధులంతా కృష్ణదాసుకు వ్యతిరేకంగా జరిగిన సమావేశంలో పాల్టొనటంతో నరసన్నపేట అధికార పార్టీలో వణుకు మొదలయ్యింది. ఇదే పరిస్ధతి కొనసాగితే కృష్ణదాసుకు వచ్చే ఎన్నికల్లో ఇబ్బందులు తప్పవన్న బావన నియోజకవర్గ వాసుల్లో వ్యక్తమౌతోంది.