సిరా న్యూస్, ఆదిలాబాద్:
పాయల్కు పట్టం కట్టిన ఆదిలాబాద్ ఓటర్లు…
+ 15 ఏండ్ల పోరాటానికి దక్కిన ప్రతిఫలం
+ వినయం, విధేయత, నిబద్ధతకు ఓటేసిన ప్రజానికం
+ కౌంటింగ్ తరువాత కన్నీటి పర్యాంతమైన పాయల్ శంకర్
+ కార్యకర్తలకు, ఓటర్లకు కృతజ్ఞతలు
+ ఆదిలాబాద్ అభివృద్ధికి కట్టుబడి ఉంటానని హామీ
పట్టువదలని విక్రమార్కుడిలా 15 ఏండ్లు ప్రతిపక్షంలో ఉంటూ ప్రజల పక్షాన అలుపెరుగని పోరాటాలు చేసిన పాయల్ శంకర్కు ఈ సారి ఆదిలాబాద్ ఓటర్లు పట్టం కట్టారు. అసెంబ్లీ ఎన్నికల్లో కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి, పాయల్ శంకర్ను ఎమ్మెల్యేగా గెలిపించారు. గత 15 ఏండ్లుగా నిర్విరామంగా ప్రజల్లో ఉంటూ, ప్రజల పక్షాన పోరాటం చేస్తున్న ఆయన ధీరత్వానికి స్వయంగా ఎమ్మెల్యే పదవే నీ గులామునంటూ సలాము చేసింది. 67608 ఓట్లు సాధించిన ఆయన తన సమీప ప్రత్యర్థి జోగు రామన్న(60916) పై 6692 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.
కలిసొచ్చిన హిందుత్వ వాదం..
ఏండ్లుగా ప్రజా క్షేత్రంలో ఉన్న పాయల్ శంకర్, రెండు సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి పాలైనప్పటికీ కూడ ఏ నాడు తన హుందాతనాన్ని వదుకోలేదు. తనకు పోటీగా ఎన్ఆర్ఐ కంది శ్రీనివాస రెడ్డి బీజేపీ తీర్థం పుచ్చుకున్న సమయంలో కూడ బీజేపీని వీడకుండా తన నిబధ్ధత చాటుకున్నారు. ఇదే కాకుండా బీజేపీ పార్టీ హిందుత్వ వాదమును ప్రజల్లో తీసుకెళ్లడంలో వందశాతం ఆయన సఫలమైన ఆయన ఈ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పక్కా ప్రణాళికతో ముందుకుపోవడంతో విజయం అనివార్యమైంది. ఎన్ఆర్ కంది శ్రీనివాస రెడ్డి బీజేపీ నుంచి కాంగ్రేస్ పార్టీలోకి వెళ్లడం, కాంగ్రేస్ టికెట్తో ఎమ్మెల్యేగా బరిలో ఉండటం కూడ పాయల్కు ప్లస్ పాయింట్గా మారిందని విశ్లేషకులు చెబుతున్నారు. బీఆర్ఎస్ ఖాతాలో ఉన్న రెడ్డి ముస్లీం, రెడ్డి సామాజిక వర్గం ఓట్లను కంది శ్రీనివాస రెడ్డి తన ఖాతాలో వేసుకోవడం కూడ పాయల్కు కలిసొచ్చిందని ప్రజలు చర్చించుకుంటున్నారు. కాగా రాష్ట్రమంత కాంగ్రేస్ వర్సెస్ బీఆర్ఎస్ అన్నట్లుగా ఉన్న ఇలాంటి తరుణంలో బీజేపీ నుంచి పాయల్ శంకర్ గెలుపొందడంతో యావత్ రాష్ట్రం చూపు ఆదిలాబాద్ వైపు పడిందనే చెప్పవచ్చు.
కన్నీటి పర్యాంతమైన పాయల్ శంకర్..
కౌటింగ్ తరువాత పాయల్ శంకర్ బరువెక్కిన హృదయంతో మాట్లాడుతూ కన్నీటి పర్యాంతమై, తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. తన కోసం అహర్నిశలు శ్రమించిన కార్యకర్తలు, నాయకులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. తనపై నమ్మకంతో ఎమ్మెల్యేగా గెలిపించిన ఓటర్లకు రుణపడి ఉంటానని అన్నారు. ప్రజల నమ్మకాన్ని వమ్ముచేయకుండా ఆదిలాబాద్ను అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడిపిస్తానని హామీ ఇచ్చారు.