సిరా న్యూస్;
సార్వత్రిక ఎన్నికల్లో 400ఎంపీ స్థానాలు గెలుచుకుంటామంటున్నారు బీజేపీ నేతలు. రాజస్థాన్, ఎంపి, ఛత్తీస్గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయాలే తమ ధీమాకు కారణమని చెబుతున్నారు
సెమీ ఫైనలో.. క్వార్టర్ ఫైనలో ఎవరికి నచ్చింది వాళ్లు పిలుచుకోవచ్చు కానీ ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు మాత్రం బీజేపీలో జోష్ను నింపాయి. సార్వత్రిక ఎన్నికలకు మరికొన్ని నెలలే సమయం ఉండగా.. రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ లో బీజేపీ సాధించిన విజయాలు ఆ పార్టీ కార్యకర్తల్లో కొత్త ఉత్సహాన్ని తీసుకొచ్చాయి. అటు కాంగ్రెస్సైతం తెలంగాణను గెలుచుకున్నా.. ఛత్తీస్గఢ్, రాజస్థాన్లో అధికారాన్ని పొగొట్టుకుంది. మధ్యప్రదేశ్లోనూ శివరాజ్సింగ్ చౌహన్ దెబ్బకు చేతులేత్తేసింది. ఇది కాంగ్రెస్కు గట్టి దెబ్బగానే చెప్పాలి. మిజోరం ఎన్నికల ఫలితాలను పక్కన పెడితే మిగిలిన నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ గెలవడం విశేషం. అంటే బీజేపీ 3-1తేడాతో ఈ సెమీస్ విజయాన్ని సాధించింది. తాజాగా జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో మూడు రాష్ట్రాలను బీజేపీ గెలుచుకుంది. కాంగ్రెస్ తెలంగాణతో సరిపెట్టుకుంటే బీజేపీ రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో విజయఢంకా మోగించింది. ఈ విజయాలతో బీజేపీ ఖాతాలో 12 రాష్ట్రాలు వచ్చి చేరాయి. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్, అసోం, చత్తీస్గఢ్, హర్యానా, ఉత్తరాఖండ్, త్రిపుర, మణిపూర్, గోవా, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో బీజేపీ సోలోగా ప్రభుత్వాన్ని రన్ చేస్తోంది. మహారాష్ట్ర, మేఘాలయ, నాగాలాండ్, సిక్కింలలో సంకీర్ణ ప్రభుత్వాల్లో భాగంగా ఉంది. అటు కాంగ్రెస్ పరిస్థితి మాత్రం బీజేపీకి పూర్తి భిన్నంగా ఉంది. దేశ జనాభాలో కేవలం 8.51 శాతం ఉన్న కర్ణాటక, తెలంగాణ, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో మాత్రమే కాంగ్రెస్ అధికారంలో ఉంది.2019 ఏప్రిల్ 11 నుంచి మే 19 వరకు ఏడు దశల్లో సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. ఓట్లను లెక్కించి మే 23న ఫలితాలు ప్రకటించారు. ఈ ఎన్నికల్లో బీజేపీ 303 స్థానాలు గెలుచుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఎన్డీఏ కూటమి సంఖ్యను కలపకుండానే బీజేపీ 272 మ్యాజిక్ ఫిగర్ను క్రాస్ చేసింది. లోక్సభలో మొత్తం 543 ఎంపీ సీట్లకు ఎన్నికలు జరుగుతాయి. వీటిలో అత్యధికంగా ఎంపీల సంఖ్య ఉన్న రాష్ట్రం ఉత్తరప్రదేశ్. యూపీలో మొత్తం 80 ఎంపీ సీట్లు ఉన్నాయి.రానున్న సార్వత్రిక ఎన్నికల్లోనూ ఈ మూడు(రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్) రాష్ట్రాల్లో బీజేపీ భారీగా ఎంపీ స్థానాలు గెలుచుకునే అవకాశం ఉందా లేదా అన్నదానిపై విశ్లేషకులు భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికలను సార్వత్రిక ఎన్నికలను ప్రజలు ఒకేలాగా చూడరని కొంతమంది వాదిస్తుండగా.. అసెంబ్లీ రాష్ట్రాల గెలుపే పార్లమెంట్ ఎన్నికల్లోనూ కనిపించే అవకాశాలు ఉంటాయని మరికొంతమంది వాదిస్తున్నారు. గత ఎన్నికల్లో రిజల్ట్స్ ఎలా వచ్చాయో ఓ సారి గుర్తు చేసుకోమంటున్నారు.మొత్తం 25 ఎంపీ స్థానాలున్న రాజస్థాన్లో గత 2019 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ ఏకంగా 24 సీట్లు గెలుచుకుంది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచినా పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం కనీసం ఖాతా తెరవలేకపోయింది INC. ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ బొక్కబోర్లా పడడంతో రానున్న జనరల్ ఎలక్షన్స్లో ఏ మేరకు రాణిస్తుందో చూడాలి.ఛత్తీస్గఢ్లో గత సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటింది. మొత్తం 11 ఎంపీ స్థానాలకు 9 స్థానాలను గెలుచుకుంది. తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ బీజేపీ గెలిచింది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తారుమారు చేస్తూ బీజేపీ విజయం సాధించింది.మొత్తం 543 సీట్లలో 400 సీట్లు గెలవాలంటే దక్షిణాదిన కూడా సీట్లు ఎక్కువగా గెలుచుకోవాల్సి ఉంటుంది. అది పొత్తులతోనే సాధ్యం. ఈ పొత్తులపై ఇప్పటివరకు స్పష్టమైన క్లారిటీ అయితే లేదు కానీ.. కర్ణాటక, తెలంగాణలో బీజేపీ భారీ స్థాయిలో ఎంపీ స్థానాలను గెలుచుకోవాలని తీవ్రంగా ప్రయత్నించే అవకాశాలున్నాయి. కర్ణాటకలో మొత్తం 28 ఎంపీ స్థానాలు ఉండగా.. గత పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ ఏకంగా 25 ఎంపీస్థానాలను గెలుచుకుంది. ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం చావుదెబ్బ తిన్నది. అయితే ఎంపీ ఎన్నికలనే సరికి ప్రజలందరూ మోదీని చూసి ఓటు వేస్తారంటున్నారు బీజేపీ నేతలు. మోదీ ఛారిష్మాతోనే మరోసారి అధికారంలోకి వస్తామని.. ఈసారి ఏకంగా 400 ఎంపీ సీట్లు గెలుస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు.