సిరాన్యూస్, భీమదేవరపల్లి
రుణమాఫీ పై ఆంక్షలు ఎందుకు : బీజేపీ మండల అధ్యక్షులు పైడిపెల్లి పృథ్విరాజ్ గౌడ్
అధికారంలోకి రావడం కోసం ఎన్నికల సమయంలో రుణమాఫీ హామీ ఇచ్చిన కాంగ్రెస్ ఇప్పుడు ఆంక్షలు విధించి మాట మారుస్తున్నదని బీజేపీ మండల అధ్యక్షుడు పైడిపల్లి పృథ్వీరాజ్ ఆరోపించారు. మంగళవారం భీమదేవరపల్లి మండలంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతులకు రుణభారాన్ని తగ్గించాలన్న చిత్తశుద్ధికి బదులుగా ఖజానా పై భారం తగ్గించుకోడానికే రాష్ట్ర ప్రభుత్వం ఎక్కువ ఆలోచిస్తున్నదన్నారు. ఎన్నికలప్పుడు ఒక మాట ఇచ్చి పవర్ లోకి వచ్చిన తర్వాత మరో తీరులో వ్యవహరిస్తున్నదని విమర్శించారు. ఆహార భద్రత కార్డు ప్రామాణికం, పీఎం కిసాన్ పథకం నిబంధనలను పరిగణనలోకి తీసుకుంటామంటూ మార్గదర్శకాల్లో పేర్కొన్న రాష్ట్ర ప్రభుత్వం లక్షలాది మంది రైతుల ఆశలపై నీళ్లు చల్లుతున్నదన్నారు. మార్గదర్శకాల్లో 2018 కంటే ముందున్న రైతులకు వర్తించదనే నిబంధన సమంజసం కాదన్నారు. గతంలో ఒకే రేషన్ కార్డులో ఉన్న అన్నదమ్ములు వేరుపడ్డారని, భూములు పంచుకొని విడివిడిగా లోన్ తీసుకున్నారని, అలాంటి వారి పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. కుటుంబంలో ఒకరికి చిన్న స్థాయి ప్రభుత్వ ఉద్యోగం ఉన్న కుటుంబం మొత్తానికి తెల్ల రేషన్ కార్డు తీసేస్తారని, ఇలాంటి కండిషన్ పెట్టడం సరైన పద్ధతి కాదని పేర్కొన్నారు. ఏకకాలంలో 2 లక్షలు రుణమాఫీ చేస్తానని చెప్పిన కాంగ్రెస్, ముందుగా లక్ష రూపాయలు మాత్రమే మాఫీ చేస్తామనడం సమంజసం కాదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలకు మంచి చేయాలనే చిత్తశుద్ధి ఉంటే ఎలాంటి ఆంక్షలు లేకుండా రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు.