సిరాన్యూస్,భద్రాద్రి కొత్తగూడెం
నష్టపోయిన రైతాంగాన్ని తక్షణమే ఆదుకోవాలి
* అఖిల భారత ప్రగతిశీల రైతు సంఘం చర్ల మండల నాయకులు కొండా కౌశిక్
* ప్రభుత్వం స్పందించకపోతే పోరాటాలు తప్పవు
నష్టపోయిన రైతాంగాన్ని తక్షణమే ఆదుకోవాలని అఖిల భారత ప్రగతిశీల రైతు సంఘం చర్ల మండల నాయకులు కొండా కౌశిక్ అన్నారు.భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండల పరిధిలోని గుంపెనగూడెం గ్రామాన్ని సోమవారం అఖిలభారత ప్రగతిశీల రైతు సంఘం మండల నాయకులు కొండా కౌశిక్ సందర్శించారు. ఈ క్రమంలో అక్కడ రైతుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండల పరిధిలో ఉన్న గుంపెనగూడెం గ్రామంలో ఇటీవల కురిసిన భయంకరమైన వర్షాల తుఫాన్ల కారణంగా భారీ వరదలు రావడంతో సుమారు 8 ఎకరాలు వరి పంటలు మొత్తం నీట మునిగి రెండు మూడు రోజులు నీరు నిల్వ ఉండడంతో వరి పంటల మొత్తం సర్వనాశనం అయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు తిని తినక కష్టం చేసి చెమటోడ్చి వ్యవసాయమే ఊపిరిగా చేసుకొని బ్రతుకుతుంటారని ఆయన తెలిపారు. ఇప్పటికే దుక్కుల, కూలీలా పేరిట, ఎరువులు, మందుల పిచికారీ పేరిట, వరి పంట ఎకరాకు సుమారు 50 వేల రూపాయలు ఖర్చు చేశామని, అలా ఎనిమిది ఎకరాల వరకు నష్టం వాటిల్లిందని రైతుల క్లుప్తంగా తెలిపారు అన్నారు. ఈ పెట్టుబడి నగదును బయట ఐదు రూపాయల వడ్డీలకు తీసుకొచ్చి వరి పంట వ్యవసాయానికి పెట్టుబడిగా పెట్టామని తీరా చూస్తే వరదల కారణంగా పంటలు మొత్తం సర్వనాశనం అయ్యాయని రైతన్నలు గోడువెళ్ళబుచ్చారన్నారు. తక్షణమే ఈ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ నష్టపోయిన రైతాంగాన్ని గుర్తించి వారిని ఆదుకోవాలని తద్వారా రైతంగాన్ని కాపాడుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేనియెడల అఖిల భారత ప్రగతిశీల రైతు సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాటాలు నిర్వహిస్తామని హెచ్చరించారు.