పిఎసిఎస్ ముందు “సాన చంద్రయ్య” విగ్రహం ఏర్పాటు చేయాలి
జనవరి19న ఆయన 10వ వర్ధంతి సభ నిర్వహించాలి
సిరా న్యూస్,జగిత్యాల;
జిల్లా ధర్మపురిలోని పిఎసిఎస్ కు “సాన చంద్రయ్య ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం” గా పేరు మార్చాలని బుగ్గారం గ్రామ అభివృద్ది కమిటి పక్షాన బుధవారం కరీంనగర్ డిసిఎంఎస్ చైర్మన్ అయిన ధర్మపురి పిఎసిఎస్ చైర్మన్ ఎల్లాల శ్రీకాంత్ రెడ్డి ని కోరారు.బుధవారం వారు ధర్మపురిలో ఎల్లాల శ్రీకాంత్ రెడ్డి కి పలు డిమాండ్ల తో కూడిన ఒక వినతి పత్రం అందజేశారు. 2013 డిసెంబర్ 24 అర్థ రాత్రి ధర్మపురి పిఎసిఎస్ యందు జరిగిన దొంగ తనం కేసులో తప్పుడు ఆరోపణలతో బుగ్గారం గ్రామానికి చెందిన సాన చంద్రయ్య ను అన్యాయంగా చిత్రహింసలు పెట్టి కోరుట్ల లాకప్ డెత్ లో చంపారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. నిరాధారమైన అనుమానాలతో పోలీస్ దెబ్బలకు ప్రాణాలు కోల్పోయిన సాన చంద్రయ్య విగ్రహాన్ని ధర్మపురి పిఎసిఎస్ ముందు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. 2014 జనవరి 19 నాటికి “లాకప్ డెత్” జరిగి పదేండ్లు పూర్తవుతున్న సందర్భంగా ఆరోజున ధర్మపురి పిఎసిఎస్ ముందు “సాన చంద్రయ్య వర్ధంతి సభ” నిర్వహించాలని కోరారు. మృతుడు సాన చంద్రయ్య కుటుంబానికి సరైన న్యాయం ఇప్పటికీ జరుగలేదని ఇకనైనా పూర్తి స్థాయిలో ఆ బాధిత కుటుంబానికి న్యాయం చేసి ఆదుకోవాలని సూచించారు. దొంగతనం కేసులో కోల్పోయిన బంగారం, నగదు నష్టాన్ని రైతుల వాటా ధనం డబ్బుల నుండి చెల్లించడం చట్ట విరుద్ధమన్నారు. ఆ నిర్ణయం తీసుకొని అమలు చేసిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అసలైన దొంగల ద్వారా పోయిన సొమ్ము రికవరీ చేసి బ్యాంక్ నుండి డ్రా చేసిన రైతుల వాటా ధనం డబ్బులను తగు వడ్డీతో సహా తిరిగి డిపాజిట్ చేయాలని కోరారు.
ధర్మపురి నుండి బుగ్గారం మండలం వేరుగాఏర్పడినందున పి.ఎ.సి.ఎస్. ను కూడా బుగ్గారం కు సెపరేట్ చేయాలని కోరారు. అందుకు తగిన విధంగా పిఎసిఎస్ ద్వారా తీర్మానాలు చేసి ఉన్నతాధికారులకు నివేదికలు పంపి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. గ్రామ అభివృద్ది కమిటి అధ్యక్షులు నక్క చంద్రమౌళి అధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు సుంకం ప్రశాంత్, కోర్ కమిటి చైర్మన్ చుక్క గంగారెడ్డి, వైస్ చైర్మన్ పెద్దనవేని రాగన్న, సభ్యులు సుంకం గంగారెడ్డి, భారతపు శంకరయ్య తదితరులున్నారు.