సిరా న్యూస్;
దేశంలో రైతుల ఆత్మహత్యల కన్నా విద్యార్థులు, యువకులు ఆత్మహత్యలు ఎక్కువగా ఉన్నాయన్న కఠిన వాస్తవాన్ని వెల్లడించింది. విద్యార్థుల ఆత్మహత్యల నివారణ భాధ్యత ప్రభుత్వంపై, విద్యార్థుల తల్లిదండ్రులపై ఉంది. చదువు ఒక్కటే సర్వం కాదనీ, అది జీవితంలో ఒక భాగం మాత్రమే అని విద్యార్థులకు అర్థమయ్యేలా చెప్పాలి.చదువుల ఒత్తిడితో ముక్కు పచ్చలారని రెండు పదుల వయసులోనే పసిప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి. చదువుల ఒత్తిడి వల్ల, తల్లిదండ్రుల కలలు నెరవేర్చలేమనే బాధతో విద్యా కుసుమాలు నేలరాలుతున్నాయి. తమ బాధను ఎవరికి చెప్పుకోవాలో తెలియక పసి ప్రాణాలు అర్ధాంతరంగా తనువు చాలిస్తున్నాయి. చాలా మంది విద్యార్థులు ఈ నీట్, జేఈఈ ప్రవేశ పరీక్షలకు ఎంతో కష్టపడి సిద్ధం అవుతున్నారు. ఈ పరీక్షలకి కోచింగ్ ఇవ్వడంలో రాజస్థాన్ రాష్ట్రం లోని కోటా అనే ప్రాంతం చాలా ప్రసిద్ధి గాంచింది. నీట్, జేఈఈ ప్రవేశ పరీక్షల కోచింగ్కు కోటాను ఎడ్యుకేషన్ హబ్గా భావిస్తారు. ఇక్కడికి దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి విద్యార్థులు భారీగా వచ్చి చదువుతూ ఉంటారు. ఇదంతా నాణేనికి ఒకవైపు అయితే పరీక్షకు సిద్ధం అయ్యే సమయంలో చాలా మంది విద్యార్థులు ఆ ఒత్తిడిని తట్టుకోలేక బలవన్మరణాలకు పాల్పడుతున్నారు.రాజస్థాన్లోని కోటలో దాదాపు రెండు లక్షలకు పైగా విద్యార్థులు వివిధ రకాల కోర్సులకు శిక్షణ పొందుతున్నారు. అక్కడ కోచింగ్ సెంటర్లు పుట్టగొడుగుల్లా పుట్టకొచ్చాయి. ఇక్కడ కోచింగ్ తీసుకునే విద్యార్థుల్లో ఎక్కువ శాతం మంది గ్రామీణ ప్రాంతాల్లోని రైతు కుటుంబాలకు చెందిన వారే కావడం గమనార్హం. ఇక్కడ కోచింగ్ తీసుకుంటే భవిష్యత్తు బాగుపడుతుందనే ఉద్దేశ్యంతో తల్లిదండ్రులు లక్షలు పెట్టి తమ బిడ్డల్ని ఈ కోర్సుల్లో చేర్పిస్తున్నరు. వారు ఇక్కడ చేరిన తర్వాత ఇంటికీ, తల్లిదండ్రులకు దూరంగా ఉండి చదువు, పరీక్షల ఒత్తిడిని భరించలేక పరీక్షలో క్వాలిఫై అయితామో లేదా అనే భయంతో, దీనికి తోడు కోచింగ్లో భాగంగా నిర్వహించేటటువంటి ఇంటర్నల్ పరీక్షల్లో తక్కువ మార్కులు రావడంతో ఒత్తిళ్లకు లోనై ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ముఖ్యంగా వీక్లీ టెస్ట్ నిర్వహించి ఫలితాలు వచ్చినప్పుడే ఎక్కువ మంది ఆత్మహత్యలకు పాల్పడడం గమనార్హం. గత పదేళ్ల నుండి ఇక్కడ చదువుతున్న విద్యార్థుల్లో దాదాపు 100 మందికి పైగా చనిపోయినట్టు లెక్కలు చెబుతున్నాయి. ఈ సంఖ్య గత సంవత్సరం నుంచి గణనీయంగా పెరిగిపోయింది. దాదాపు నెలకు ఇద్దరు ముగ్గురు చొప్పున విద్యార్థులు తమ ప్రాణాలను తీసుకుంటున్నారు. కేవలం ఈ సంవత్సరంలోనే దాదాపు 30 మంది విద్యార్థుల వరకు తమ ప్రాణాలను తీసుకున్నారు. రెండు నెలల క్రితం ఒకే రోజులో కేవలం ఒక గంట వ్యవధిలో ఇద్దరు విద్యార్థులు తమ ప్రాణాలను తీసుకోవడం గమనార్హం.రాజస్థాన్ ప్రభుత్వం సెప్టెంబర్ అక్టోబర్ నెలలో విద్యార్థులకు ఎటువంటి టెస్టులు నిర్వహించరాదని ఆదేశాలు జారీ చేసింది. మానసిక ఆరోగ్య నిపుణులతో ప్రత్యేక క్లాసులు నిర్వహిస్తూ, ఆత్మహత్యల నివారణకు ఒత్తిళ్లకు గురైనటువంటి విద్యార్థులలో ధైర్యం నింపేందుకు టోల్ ఫ్రీ నెంబర్లను కూడా ఏర్పాటు చేశారు. ఈ టోల్ ఫ్రీ నెంబర్లకు అధికారులు కూడా ఊహించని స్థాయిలో ఫోన్లో వస్తుండడం కూడా విద్యార్థులు ఎంత మానసిక ఒత్తిడికి గురవుతున్నారో తెలుపుతుంది