సిరా న్యూస్;
సార్వత్రిక ఎన్నికల్లో కత్తులు దూస్తున్న ఎన్డీఏ, ఇండి-కూటముల్లో పరస్పర భిన్నమైన వాతావరణం కనిపిస్తోంది. ఎన్డీఏలో చేరికల పర్వం కొనసాగుతుంటే, ఇండి కూటమి నుంచి ఒక్కొక్కరుగా జారుకుంటున్నారు. బిహార్ సీఎం నితీశ్ కుమార్ విపక్ష కూటమి వీడి ఎన్డీఏలో చేరడం ఆ కూటమికి శరాఘాతంగా మారింది. తాజాగా పశ్చిమ బెంగాల్లో కాంగ్రెస్ పార్టీకి సీట్లు ఇచ్చే ప్రసక్తే లేదంటూ మమత బెనర్జీ బాంబు పేల్చారు. ఆమ్ ఆద్మీ పార్టీతో ఢిల్లీ సహా ఇతర రాష్ట్రాల్లో పొత్తు కుదిరినా.. పంజాబ్లో మాత్రం సాధ్యం కాలేదు. కమ్యూనిస్టులతో కేరళలో వైరం, బయట స్నేహం అన్నట్టుగా కాంగ్రెస్ కలహాల కాపురం సాగిస్తోంది. మొత్తంగా విపక్ష కూటమిలో అనేక లోపాలు కనిపిస్తున్నాయి. ఉమ్మడి ఎజెండా, ప్రధాని అభ్యర్థిని ప్రకటించకపోవడం ప్రతికూలాంశాలు కాగా.. అనైక్యత, పరస్పర అపనమ్మకం కూడా ఆ కూటమిలో చాలా ఎక్కువగా కనిపిస్తోంది. మోదీని గద్దె దించడమే తమ లక్ష్యం అన్నట్టుగా వ్యవహరిస్తోంది తప్ప.. తాము గద్దెనెక్కితే ఏం చేస్తామన్నది ప్రజలకు చెప్పలేకపోతోంది. గత పదేళ్లలో ఎన్డీఏ పాలనలో దేశంలో మౌలిక వసతులతో పాటు వివిధ రంగాల్లో జరిగిన అభివృద్ధి, మెరుగుపడ్డ ఆర్థిక వ్యవస్థ, ప్రపంచ దేశాల్లో పెరిగిన ప్రతిష్ట, పరపతి, చివరి వరుసలో ఉన్న లబ్దిదారుడి వరకు చేరుతున్న సంక్షేమం, ఉచిత రేషన్ సహా అనేకాంశాలు ఆ కూటమికి బలాలుగా మారాయి. ఆర్టికల్ 370 రద్దు, అయోధ్య రామ మందిర నిర్మాణం వంటి చర్యలతో ఇచ్చిన హామీలను ఎలాగైనా సరే అమలు చేస్తుందన్న నమ్మకాన్ని పెంచాయి. దేశం కోసం కఠిన నిర్ణయాలు తీసుకోగలదు అన్న విశ్వాసాన్ని కల్గించాయి. దీంతో మళ్లీ ఈసారి గెలిచేది బీజేపీయేనన్న భావన దేశవ్యాప్తంగా అనేక రాజకీయ పార్టీల్లో పెరిగింది. అందుకే అన్ని పార్టీల చూపు ఆ వైపే ఉంది.ఐదేళ్ల క్రితం జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ దేశవ్యాప్తంగా సొంతంగానే 303 సీట్లు సాధించింది. కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలతో కూడిన భారతదేశ దక్షిణ ప్రాంతంలో మొత్తం 129 సీట్లు ఉన్నాయి. వీటిలో కర్ణాటక, తెలంగాణలో మినహా మరెక్కడా బీజేపీ గత ఎన్నికల్లో ఒక్క సీటు కూడా సాధించలేకపోయింది. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళలో అసలు ఖాతాయే తెరవలేదు. ఈ రాష్ట్రాల్లో బీజేపీ సంస్థాగతంగా బలంగా లేకపోవడంతో ఘోర పరాజయం చవిచూడాల్సి వచ్చింది. ఈ ఐదేళ్లలో తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో పార్టీ పరిస్థితి కాస్త మెరుగుపడినప్పటికీ.. ఒంటరిగా పోటీ చేసి గెలుపొందే బలం లేదు. ఆంధ్రప్రదేశ్లో బీజేపీ పరిస్థితిలో మార్పు లేదు. బిహార్, ఒడిశా వంటి రాష్ట్రాల్లో బీజేపీ బలంగానే ఉన్నప్పటికీ.. వీలైనన్ని ఎక్కువ సీట్లు గెలుపొందాలంటే సొంత బలం మాత్రమే సరిపోదని కాషాయదళం భావిస్తోంది. ఈ పరిస్థితుల్లో ఆయా రాష్ట్రాల్లో బలంగా ఉన్న పార్టీలతో పొత్తుల ద్వారా ప్రయోజనం పొందవచ్చని, సొంతంగా కొన్ని సీట్లతో పాటు మిత్రపక్షానికి వచ్చే సీట్లు ఎన్డీఏ కూటమికి అదనపు బలాన్ని ఇస్తాయని కమలనాథులు అంచనా వేస్తున్నారు. అంతేకాదు.. తమ పాతమిత్రులను ప్రత్యర్థి వర్గంలో ఉంచడం వల్ల నష్టమే తప్ప లాభం లేదని కూడా భావిస్తున్నారు.ఉత్తర్ ప్రదేశ్లో అప్నాదళ్, రాష్ట్రీయ లోక్దళ్ వంటి పార్టీలకు కొన్ని సామాజికవర్గాల్లో మద్దతు ఉంది. అయితే కేవలం వారి మద్దతుతోనే ఎన్నికల్లో గెలుపొందడం సాధ్యం కాదు. అందుకే ఆ పార్టీ బీజేపీతో కలిసి నడిస్తే.. ఒకట్రెండు సీట్లు, వాటిని గెలిపించుకుంటే కేంద్ర మంత్రివర్గంలో చోటు లభిస్తోంది. ఈ చిన్న పార్టీని కలుపుకోవడం వల్ల కనీసం 2-3 శాతం ఓట్లు బీజేపీకి కూడా అదనంగా వచ్చి చేరుతున్నాయి. స్వల్ప తేడాతో విజయం తారుమారయ్యే పరిస్థితుల్లో ఒక్క ఓటు కూడా కీలకమే. 2019 సార్వత్రిక ఎన్నికల్లో యూపీలో బీజేపీ స్కోర్ తగ్గడం ఆర్ఎల్డీ పాత్ర ఉంది. రాష్ట్రం మొత్తం జనాభాలో జాట్ల సంఖ్య కేవలం 3 శాతమే అయినప్పటికీ.. పశ్చిమ యూపీలోని 6 జిల్లాల్లో వారి జనాభా 10 శాతం వరకు ఉంది. జాట్ల ప్రాబల్యం ఎక్కువగా ఉన్న పశ్చిమ యూపీలోనే బీజేపీ సీట్లు కోల్పోయింది. అందుకే చిన్న పార్టీలనైనా సరే బీజేపీ కలుపుకుంటూ మందుకు సాగుతోంది. మిషన్ 400 ప్లస్ సాధనలో ఈ పార్టీలతో దోస్తీ అవసరమేనని కమలనాథులు భావించారు.సాధారణంగా ఏ రాజకీయ పార్టీ అయినా ఇతరులతో కలిసి అధికారంలో భాగం పంచుకోవడం కంటే సొంతంగా బలపడి గెలుపొందాలని చూస్తుంది. ఇందుకు భారతీయ జనతా పార్టీ కూడా మినహాయింపు కాదు. ఈ దిశగా ఆ పార్టీ చేసిన ప్రయత్నాలు కొన్ని చోట్ల ఫలించినా.. మరికొన్ని చోట్ల ఆశించిన ఫలితాలు ఇవ్వలేదు. మహారాష్ట్రలో చిరకాల మిత్రపక్షం శివసేనతో కలిసి సాగించిన ప్రయాణంలో ఆ రాష్ట్రంలో ఒకప్పుడు శివసేన పెద్దన్న పాత్ర పోషిస్తే.. ఆ పార్టీ సర్దుబాటు చేసిన సీట్లలో బీజేపీ పోటీ చేసేది. కాలక్రమంలో బీజేపీ సొంతంగా బలపడేకొద్దీ శివసేనతో విబేధాలు పెరిగాయి. అసెంబ్లీ ఎన్నికల్లో చెరిసగం సీట్లలో పోటీ చేసినప్పుడు బీజేపీ ఎక్కువ సీట్లలో గెలుపొంది, శివసేన తక్కువ సీట్లకు పరిమితం కావడంతో ఈ అంతరం మరింత పెరిగింది. చివరకు పొత్తు ధర్మాన్ని కాదని శివసేన ప్రతిపక్షాలతో చేతులు కలిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం, ఆ శివసేన చీల్చి బీజేపీ మళ్లీ ప్రభుత్వాన్ని హస్తగతం చేసుకోవడం అందరికీ తెలిసిన విషయాలే. ఈ ఘటనల తర్వాత బీజేపీ ఆ రాష్ట్రంలో పెద్దన్న పాత్రకు ఎదిగింది. త్వరలో జరగనున్న లోక్సభ ఎన్నికల్లో మూడింట రెండొంతుల సీట్లు బీజేపీ పోటీ చేస్తుండగా.. మిగతా స్థానాల్లో శివసేన, ఎన్సీపీ చీలిక వర్గాలు పోటీ చేసేలా సర్దుబాటు ఒప్పందం కుదిరింది. ఈ తరహా పరిస్థితులు మరికొన్ని రాష్ట్రాల్లోనూ చోటుచేసుకున్నాయి. మొత్తంగా వేర్వేరు కారణాలు, వేర్వేరు సాకులతో బీజేపీతో జట్టుకట్టిన పార్టీలు ఒక్కొక్కటిగా దూరమవుతూ వచ్చాయి.