ఇక అమరావతి పరుగులే…

సిరా న్యూస్,విజయవాడ;
అమరావతి రాజధానిగా ప్రజలు ఎన్నికల ఫలితాల ద్వారా ఓ స్పష్టమైన తీర్పు ఇచ్చారు. అయితే ఇప్పుడు అసలు సమస్య గతంలో ప్రభుత్వం అనుకున్న విధంగా అమరావతిని నిర్మించగలదా అని. ఎందుకంటే ఐదేళ్ల పాటు అమరవతి ఎక్కడిదక్కడే ఉంది. అంటే పిచ్చి మొక్కలు పెరిగిపోయి అడవిలా మారిపోయింది. అన్ని రకాల ఒప్పందాలను రద్దు చేసుకున్నారు. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే అమరావతిని నిర్వీర్యం అయిపోయింది. మళ్లీ బూడిద నుంచి పైకి లేపాల్సిన బాధ్యత చంద్రబాబుపై పడింది. ఒక్కొక్కటిగా మళ్లీ అమరావతిని ఆయన దారికి తెస్తూ వస్తున్నరు. ముందుగా నిధుల సమస్యను పరిష్కరించుకున్నరు. అమరావతికి అప్పు లేకపోతే నిధులు ఏవైనా ఇప్పటికిప్పుడు ఈ ఆర్థిక సంవత్సరంలో రూ. పదిహేను వేల కోట్లు అందేలా చేస్తామని బడ్జెట్‌లోనే హామీ ఇవ్వడంతో అమరావతికి నిధుల సమస్య దాదాపుగా పరిష్కారం అయింది. ప్రపంచబ్యాంక్‌తో ఒప్పందాలే మిగిలాయి. అడ్వాన్సులు కూడా కేంద్రం మంజూరు చేయనుంది. ఇప్పటికే అమరావతిలో జంగిల్ క్లియరెన్స్ చివరి దశలో ఉంది. మరో సారి టెండర్లు పూర్తి చేసి నిర్మాణ పనులు ప్రారంభించడమే మిగిలి ఉంది. డిజైన్ల కోసం నార్మన్ ఫోస్టర్స్ ను వెనక్కి రప్పిస్తున్నారు. గతంలో అమరావతి అభివృద్ధిలో భాగస్వాములు అయిన వారందర్ని మళ్లీ సంప్రదిస్తున్నారు. 2014లో అధికారంలకి వచ్చిన తర్వాత టీడీపీ ప్రభుత్వం అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం ద్వారా 2015లో అమరావతిని రాజధానిగా ప్రకటించింది. 2016లో సింగపూర్ ప్రభుత్వ సాయంతో కొన్ని సంస్ధలు కన్సార్టియంగా ఏర్పడి అమరావతి రాజధాని మాస్టర్ ప్లాన్ ఇచ్చాయి. సీడ్ క్యాపిటల్ అభివృద్ధికి ముందుకొచ్చాయి. అసెండాస్ సింగ్ బ్రిడ్జ్ అండ్ సెంబ్ కార్ప్ కార్పొరేష‌న్ సంస్థ‌లు క‌న్సార్షియంగా ఏర్ప‌డి సీఆర్‌డీఏతో 2017లో ఒప్పందం చేసుకున్నాయి. ఆదాయంలో 52 శాతం వాటా సింగ‌పూర్ క‌న్సార్షియం తీసుకుంటుంది. మిగిలింది సీఆర్‌డీఏకు ద‌క్కుతుంది. స్టార్ట‌ప్ ఏరియా అభివృద్ధి ద్వారా 1.15 ల‌క్ష‌ల కోట్ల ఆదాయం రాష్ట్ర ప్ర‌భుత్వానికి ద‌క్కే అవ‌కాశం ఉంటుంద‌ని అంచనా వేశారు. ఏటా 8,000 నుంచి 10,000 కోట్ల రూపాయ‌లు ప‌న్నుల రూపేణా ప్ర‌భుత్వానికి చేర‌తాయ‌ని లెక్కలేశారు. కొన్నిపనులు కూడా చేపట్టారు. కానీ జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే ఒప్పందాన్ని రద్దు చేసుకున్నారు. దాంతో అమరావతి ఒప్పందాలకు పూర్తిగ ఎండ్ కార్డ్ పడినట్లయింది. ఇప్పుడు తిరిగి కూటమి ప్రభుత్వం సింగపూర్ ప్రభుత్వ సాయంతో తిరిగి సీడ్ క్యాపిటల్ అభివృద్ధి చేయాలని సీఆర్డీయే సమావేశంలో చర్చించారు. అయితే అప్పట్లో ఈ ప్రాజెక్టు విషయంలో కీలకంగా వ్యవహరించిన అప్పటి ఈశ్వరన్ ఇప్పుడు అవినీతి ఆరోపణలతో జైలుకు వెళ్లారు. ప్రభుత్వాల్లో నిలకడ లేకపోవడం వల్ల మరోసారి సింగపూర్ అమరావతిక ఒప్పందానికి వస్తుందన్న గ్యారంటీ లేదు. కానీ ఒప్పించాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. సింగపూర్ కన్సార్షియం కూడా వెనక్కి వస్తే అమరావతిని పూర్తి స్థాయిలో పట్టాలెక్కించినట్లే అనుకోవచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *