బీజేపీకి మరో పరీక్ష

సిరా న్యూస్;
గత పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ ఓడి గెలిచినంత పనే అయింది. చావు తప్పి కన్ను లొట్ట పడ్డ చందంగా చివరకు అధికారం అయితే దక్కింది. 400 సీట్ల వరకు వస్తాయని కలలు గన్న బీజేపీ నేతలకు ఓటర్లు పెద్ద ఎత్తున షాక్ ఇచ్చారు. అంతకుముందు రెండు పర్యాయాలు ఏకపక్షంగా ఫలితాలు వచ్చినా.. మొన్నటి ఎన్నికల్లో మాత్రం పరీక్ష ఎదుర్కోక తప్పలేదు. చివరకు హ్యాట్రిక్ విజయంతో మోడీ మరోసారి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు.ఇంతవరకు బాగానే ఉన్నా.. ఇప్పుడు బీజేపీ మరో పరీక్ష ఎదుర్కోబోతోంది. అది జమ్మూకశ్మీర్, హర్యాల రాష్ట్రాల ఎన్నికల రూపంలో. ఇప్పటికే లోక్‌సభలో సరైన మెజార్టీ లేక.. మిత్రపక్షాల సహకారంతో అధికారం చేపట్టిన బీజేపీకి ఈ ఎన్నికలు మరింత టాస్క్‌లా మారాయి. లోక్‌సభ ఎన్నికల ఫలితాలు రిపీట్ కాకుండా జాగ్రత్తలు పడుతోంది. ఈ రెండు రాష్ట్రాల్లోనూ సత్తా చాటి బీజేపీ హవా కొనసాగించాలని ఉవ్విల్లూరుతోంది. అయితే.. కాంగ్రెస్ సైతం అదే స్థాయిలో బీజేపీకి షాక్ ఇవ్వాలని ప్రయత్నిస్తోంది. ఆ పార్టీ కూడా ఈ ఎన్నికలను చాలెంజింగ్‌గా తీసుకుంది. ఇక్కడ బీజేపీని ఓడగొట్టి మరోసారి బీజేపీని దెబ్బతీయాలని చూస్తోంది.జమ్మూకశ్మీర్, హర్యానా రాష్ట్రాల్లో మొత్తం 90 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. వీటిలో మ్యాజిక్ ఫిగర్ సాధించాలంటే 46 సీట్లు గెలుపొందాలి. అయితే.. ఈ మ్యాజిక్ ఫిగర్‌ను క్రాస్ చేయడం ఇప్పుడు బీజేపీకి అంత సాధ్యపడేనా..? అనే చర్చ జోరుగా సాగుతోంది. ఎందుకంటే ఆ పార్టీ తీసుకున్న పలు ప్రజావ్యతిరేక నిర్ణయాలు ఇప్పుడు ఆ పార్టీకి గుదిబండలా తయారయ్యాయంట. ఇప్పటికే హర్యానాలో రెండుసార్లు బీజేపీ ప్రభుత్వం కొలువు దీరింది. మరోసారి గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని చూస్తోంది. అటు జమ్మూకశ్మీర్‌లోనూ తన హవాను అలాగే కొనసాగించాలని అనుకుంటోంది.అయితే.. హర్యానాలో రెండుసార్లు అధికారంలోకి వచ్చిన బీజేపీపై తీవ్ర అసంతృప్తి నెలకొన్నట్లు ప్రచారం జరుగుతోంది. అక్కడ రైతు వ్యతిరేక చట్టాలు ఆ పార్టీ దెబ్బతీస్తాయని నిపుణులు చెబుతున్నారు. అలాగే.. రెజ్లర్ల ఆందోళనలు సైతం ఆ పార్టీకి నెగెటివ్ కావచ్చనే అభిప్రాయం వినిపిస్తోంది. ఈ పరిణామాలు కాస్త గెలుపోటములపై తీవ్ర ప్రభావం చూపే అవకాశాలు లేకపోలేదు.ఇక.. జమ్మూకశ్మీర్‌కు వచ్చేసరికి కాంగ్రెస్ పార్టీ నేషనల్ కాన్ఫరెన్స్‌తో జతకట్టింది. బీజేపీ మాత్రం ఒంటరిగానే బరిలోకి దిగింది. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని ఓడించడమే తమ ఏకైక ఉమ్మడి లక్ష్యంగా చేతులు కలిపిన ప్రతిపక్ష పార్టీల్లో ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) ఒకటి. జాతీయ హోదా పొందిన ఈ పార్టీ లోక్‌సభ ఎన్నికల సమయంలోనే కాంగ్రెస్‌తో చేతులు పూర్తిస్థాయిలో కలపలేకపోయింది. ఢిల్లీలో మాత్రమే దోస్తీ.. పంజాబ్‌లో కుస్తీ అన్నట్టుగా వ్యవహరించింది. ఇప్పుడు హర్యానా ఎన్నికల్లోనూ దోస్తీ యత్నాలు విఫలమయ్యాయి. ఫలితంగా మల్లయోధుల రాష్ట్రంలో రెండు జాతీయ పార్టీలు కుస్తీ పడుతున్నాయి. ఇప్పటి వరకు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే, కాంగ్రెస్ సారథ్యంలోని ఇండి కూటమి ముఖాముఖి తలపడుతున్న పరిస్థితి నుంచి బహుముఖ పోటీకి తెర లేపినట్టయింది. అంటే బీజేపీ, కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ వంటి జాతీయ పార్టీలు మాత్రమే కాదు, ఇండియన్ నేషనల్ లోక్‌దళ్, జననాయక్ జనతా పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీ, ఆజాద్ సమాజ్ పార్టీ, హర్యానా లోక్‌హిత్ పార్టీ వంటి రాజకీయ పార్టీలు సైతం ఈ ఎన్నికల బరిలో తలపడుతున్నాయి. నిజానికి కాంగ్రెస్ పార్టీతో ఆప్, జేజేపీ కలిసి పోటీచేయాలని భావించినప్పటికీ, ఆ ప్రయత్నం ఫలించలేదు. ఇప్పుడు విడివిడిగా పోటీ చేయడం వల్ల కాంగ్రెస్ పార్టీకే నష్టం వాటిల్లే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. పదేళ్లుగా ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీజేపీ గత లోక్‌సభ ఎన్నికల నాటికే ప్రభుత్వ వ్యతిరేకతను ఎదుర్కొంది. ఈ వ్యతిరేక ఓట్లు కాంగ్రెస్, ఆప్ సహా వివిధ ప్రాంతీయ పార్టీల మధ్య చీలిపోతే అంతిమంగా కమలదళానికి ప్రయోజనం చేకూర్చినట్టే అవుతుంది.కాంగ్రెస్‌తో దోస్తీని ఆప్ కోరుకున్నప్పటికీ.. కాంగ్రెస్ వైపు నుంచే స్వాగతం లభించలేదు. ఇందుక్కారణం ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ పెద్ద దిక్కుగా ఉన్న భూపీందర్ సింగ్ హుడానే. ఆమ్ ఆద్మీ పార్టీతో పొత్తు విషయంలో ఆయన మొదటి నుంచి వ్యతిరేకిస్తూ వచ్చారు. విపక్ష ఇండి కూటమి ఐక్యతను చాటే క్రమంలో పొత్తు కోసం కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రాష్ట్ర నాయకత్వానికి సిఫార్సు చేసినప్పటికీ… పొత్తు ద్వారా ఆమ్ ఆద్మీ పార్టీకి రాజకీయంగా ఎదిగే అవకాశం ఇవ్వడం ఆత్మహత్యాసదృశ్యంగా హుడా అభివర్ణిస్తూ వచ్చారు. అయితే పొత్తును వ్యతిరేకించడానికి కేవలం రాజకీయ కారణాలు మాత్రమే కాదు, వ్యక్తిగత కారణాలు కూడా ఉన్నాయి. దళిత ఓటుబ్యాంకును ఆకట్టుకునే క్రమంలో కాంగ్రెస్ ఎంపీ షెల్జా కుమారి ఇప్పటికే దళిత ముఖ్యమంత్రి అభ్యర్థిగా రేసులో ఉన్నారు. ఇప్పుడు ఆప్‌తో జట్టుకడితే.. హర్యానా ముఖ్యమంత్రిగా ఎవరు ఉండాలన్నది ఆ పార్టీ నిర్ణయించే పరిస్థితి ఏర్పడుతుంది. అసలే సొంత పార్టీలోనే షెల్జా కుమారి నుంచి సీఎం సీటుకు ముప్పు ఎదురవుతుంటే, మరో తలనొప్పి వ్యవహారం ఆప్ రూపంలో ఎందుకు తెచ్చుకోవాలి అన్నదే హుడా ఆలోచనగా కనిపిస్తోంది.కాంగ్రెస్‌కు జమ్మూలో నేషనల్ కాన్ఫరెన్స్ తోడవ్వడంతో అక్కడ ఆ పార్టీకే గెలుపు అవకాశాలు చాలా వరకు కనిపిస్తున్నాయి. మరోవైపు.. ఆర్టికల్ 370 రద్దును కూడా అక్కడి ప్రజలు వ్యతిరేకించారు. దీంతో అక్కడ మ్యాజిక్ ఫిగర్ దక్కకపోవచ్చనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అందుకే.. ప్రస్తుతం రెండు చోట్ల కూడా బీజేపీ గడ్డు పరిస్థితులనే ఎదుర్కొంటోందనే చెప్పాలి. అయితే.. ఈ రెండు రాష్ట్రాల్లో కూడా బీజేపీకి వ్యతిరేక ఫలితాలు వస్తే.. ముందు ముందు జరగబోయే మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికలపైనా ఆ ప్రభావం చూపే అవకాశం లేకపోలేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *