సిరా న్యూస్,హైదరాబాద్;
రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదలతో కలిగిన నష్టంపై అంచనా వేసేందుకు కేంద్ర బృందం వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించనుంది.
నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ సలహాదారు, కేంద్ర హోంశాఖ జాయింట్ సెక్రటరీ కల్నల్ కీర్తిప్రతాప్ సింగ్ నేతృత్వంలో ఆరుగురు సభ్యులతో కూడిన కేంద్ర బృందం రానుంది. కల్నల్ కేపీ సింగ్తో పాటుగా బృందంలో ఆర్థిక శాఖ,వ్యవసాయ శాఖ, రోడ్లు, రహదారుల శాఖ, గ్రామీణాభివృద్ధి శాఖ, నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ విభాగాలకు చెందిన అధికారులు వస్తున్నారు. ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాలు సహా వరద కారణంగా ప్రభావితమైన ప్రాంతాల్లో పర్యటిస్తారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి బాధితులు, అధికారులతో చర్చిస్తారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో 4 రోజుల క్రితం కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్సింగ్ చౌహన్ పర్యటన జరిగింది. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఖమ్మం పర్యటనలో తెలుసుకున్న అంశాలను,బాధితుల ఆవేదన, క్షేత్రస్థాయి పరిస్థితులను ఫోన్లో కల్నల్ కీర్తిప్రతాప్ సింగ్ కు వివరించారు. కేంద్ర ప్రభుత్వం సూచనతో రాష్ట్రంలో అకాల వర్షాలు, వరదల కారణంగా జరిగిన నష్టాన్ని అంచనా వేసేందుకు కేంద్ర బృందం వస్తోంది.