సిరాన్యూస్, ఆదిలాబాద్
ప్రజా పాలన సేవా కేంద్రం ప్రారంభం : కలెక్టర్ రాజర్షి షా
రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటుచేసిన ప్రజా పాలన ఆరు గ్యారంటీల అమలులో భాగంగా గృహజ్యోతి, మహాలక్ష్మి పథకాలు రాని దరఖాస్తుదారులు ప్రజా పాలన సేవా కేంద్ర ద్వారా డేటా సవరణ( కరెక్షన్ ) చేసుకోవచ్చని జిల్లా పాలనాధికారి రాజర్షి షా అన్నారు.గురువారం సీపీఓ కార్యాలయం లో ప్రజా పాలన సేవా కేంద్రం ప్రారంభం సందర్భంగా ఆయన మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రజా పాలన ఆరు గ్యారెంటీలలో భాగంగా గృహజ్యోతి, మహాలక్ష్మి ద్వారా అమలవుతున్న రూ 500 కే గ్యాస్, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ సరఫరా స్కీముల కోసం దరఖాస్తు చేసుకున్న వారు డేటా సవరణ కోసం ప్రజా పాలన సేవా కేంద్రాలకు వెళ్లి డేటా సవరణ చేసుకొని లబ్ధి పొందాలన్నారు. ఈ సేవా కేంద్రాలు ప్రతిరోజు ఉదయం 9.00 గంటల నుంచి సాయంత్రం 5.00 గంటల వరకు పనిచేస్తాయని తెలిపారు. ప్రభుత్వ సెలవు రోజులలో ఈ సేవా కేంద్రాలు అందుబాటులో ఉండవని అన్నారు. డేటా సవరణ కోసం వెళ్లే దరఖాస్తుదారులు తమ వెంట రేషన్ కార్డ్, ఆధార్ కార్డు, విద్యుత్ సర్వీస్ కనెక్షన్ నెంబర్, గ్యాస్ కనెక్షన్ నెంబర్, ఎల్పిజి కస్టమర్ ఐడి, మొబైల్ నెంబర్ తీసుకువెళ్లాలని ఆయన సూచించారు.