సిరా న్యూస్, ఇచ్చోడ:
క్వింటాల్ కు రూ. 2వేల బోనస్ అందించాలి…
-సంగెపు బొర్రన్న
పత్తి రైతులకు క్వింటాల్ కు రూ. 2 వేల బోనస్ అందించి ప్రభుత్వం ఆదుకోవాలని రైతు స్వరాజ్య వేదిక జిల్లా అధ్యక్షులు సంగెపు బొర్రన్న డిమాండ్ చేశారు. బుధవారం ఆయన ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రంలోని మార్కెట్ యార్డ్ ను సందర్శించి పత్తి రైతులతో మాట్లాడారు. ఈ ఏడాది వాతావరణం సహకరించకపోవడంతో పత్తి దిగుబడి అంతంత మాత్రమే వచ్చిందని రైతులు ఆయనకు తెలిపారు. ఈ సందర్భంగా సంగెపు బొర్రన్న మాట్లాడుతూ… జూలై, ఆగస్టు నెలలో కురిసిన వర్షాలకు పత్తి పంట తీవ్రంగా దెబ్బతిన్నదని అన్నారు. ఇదిలా ఉండగా, రైతులు మార్కెట్ కు తీసుకొచ్చిన పత్తికి తేమ పేరుతో సిసిఐ అధికారులు కొర్రీలు పెడుతున్నారని ఆయన ఆవేదన వెలిబుచ్చారు. దీంతో గత్యంతరం లేక చాలామంది రైతులు పత్తిని ప్రైవేట్ వ్యాపారులకే అమ్ముకుంటున్నారని ఆయన అన్నారు. సీసీఐ అధికారులు, ప్రైవేట్ వ్యాపారులు కుమ్మక్కై రైతులను నిండా ముంచుతున్నారని ఆయన విమర్శించారు. ప్రభుత్వం కనీసం ఎకరాకు రూ. 10 వేల గిట్టుబాటు ధర కల్పించి పత్తి రైతులను ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఆయన వెంట పలువురు నాయకులు, రైతులు ఉన్నారు.