సిరా న్యూస్;
ఈ రోజు గట్టెక్కితే చాలు అనేదే ప్రలోభం అంటే. అందువల్ల అనేక ప్రలోభాలకు ప్రజలను గురి చేస్తుంటారు నాయకులు. ప్రజలు నిశితంగా గమనించాల్సింది హామీలు అమలు చేయదగినవా అనేది. ఇది చాలా ముఖ్యం. అమలు చేయదగిన హామీలను నమ్మవచ్చు. అలాంటి హామీలను నమ్మటానికి తాయిలాలు అవసరం లేదు. ప్రతి మనిషికీ విచక్షణ ఉంటుంది. ప్రతి మనిషికీ అర్థం అవుతుంది ఎవరు ఏం చెప్తున్నారు, వారి ఉద్దేశాలు ఏమిటి అనేది. గతంలో ఏం చెప్పారు, ఎంతమేరకు చేశారనేది ప్రతి మనిషీ బేరీజు వేసుకోగలడు. అయితే ప్రలోభాల ముందు మనిషి విచక్షణా జ్ఞానం బలహీనపడే ప్రమాదం ఉన్నది.కర్ణాటకలో వరసగా ప్రభుత్వం పన్నులు పెంచుతూ పోతుంది. ఇది తెలుగు రాష్ట్రాలకు డేంజర్ సిగ్నల్స్ పంపుతుంది. కర్ణాటకలో కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వం లోక్సభ ఎన్నికలు అయిన తర్వాత తమ ఖజానాను నింపుకునేందుకు అనేక రకాలుగా పన్నులు పెంచుతూ వస్తుంది. ఇచ్చిన హామీలు అమలు చేయాలంటే ఆ మాత్రం పన్నులు పెంచకపోతే రాబడి ఎక్కడి నుంచి వస్తుందని కర్ణాటక పాలకులు ప్రశ్నిస్తున్నారు. సంక్షేమ పథకాలను అమలు చేయాలన్నా, ఇచ్చిన హామీలను ప్రజలకు అందించాలన్నా ఖచ్చితంగా ప్రజలపై భారం మోపాల్సిందేనన్నది కన్నడ పాలకుల వాదన. ఇందుకు సహకరించాలని కూడా ప్రజలకు కర్ణాటక ప్రభుత్వం కోరుతుంది. కర్ణాటకలో ఐదు గ్యారంటీలు ఇచ్చి అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు వీటిని అమలు చేయాలంటే ఎడా పెడా పన్నులను పెంచుతూ పోతుంది. తాజాగా పెట్రోలు, డీజిల్ పై అమ్మకపు పన్ను ను పెంచింది. పెట్రోలు ధరపై మూడు రూపాయలు, డీజిల్ ధరపై లీటరకు 3.02 రూపాయలు పెంచుతూ కర్ణాటక సర్కార్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ పెంచిన ఉత్తర్వులు తక్షణమే అమలులోకి వస్తాయని తెలిపింది. దీనివల్ల ఖజానాకు 2,800 కోట్ల రాబడి సమకూరుతుందని అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే ఉచిత విద్యుత్తును అమలు చేయడానిక విద్యుత్తు ఛార్జీలను పెంచింది. మద్యం ధరలను కూడా విపరీతంగా పెంచింది. దేశీయ లిక్కర్ పై అదనపు ఎక్సైజ్ డ్యూటీ 20 శాతాన్ని పెంచారు. ఇక ఆదాయం వచ్చే అన్ని మార్గాలను వెతుక్కుంటూ కన్నడ సర్కార్ ధరలను పెంచుతూ వెళుతుంది. ఇప్పుడు తెలంగాణలోనూ ఆరు గ్యారంటీలు అమలు చేయాలంటే ఖచ్చితంగా ఏదో ఒక రూపంలో ప్రజలపై భారం మోపక తప్పని పరిస్థితి అంటున్నారు ఆర్థిక నిపుణులు. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో ఆరు గ్యారంటీల హామీతో అధికారంలోకి వచ్చింది. వీటిని అమలు చేయాలంటే వేల కోట్ల రూపాయలు అవసరమవుతాయి. ఇక మద్యం ధరలను పెంచుతారన్న ప్రచారం జరుగుతుంది. అలాగే ఆదాయం పెరిగే మార్గాలపై ఆర్థిక శాఖ మంత్రి మల్లు బట్టి విక్రమార్క ఇటీవల వివిధ శాఖల అధికారులతో సమావేశమయ్యారు. అందులో ఎక్సైజ్, రిజిస్ట్రేషన్ వంటి శాఖల అధికారులు ఉన్నారు. దీంతో ఇక్కడ కూడా ఆ శాఖలకు సంబంధించిన క్రయ విక్రయాల్లో పన్నులు పెంచే అవకాశముందన్న కామెంట్స్ వినపడుతున్నాయి. అయితే స్థానిక సంస్థలు ఉండటంతో ఇప్పుడు చేస్తారా? తర్వాత చేస్తారా? అన్నది తెలియదు కానీ.. పన్నులు పెంచడమయితే గ్యారంటీ అని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఇందుకు అతీతం కాకపోవచ్చు. ఎందుకంటే అక్కడ తెలుగుదేశం పార్టీ సూపర్ సిక్స్ తో సక్సెస్ సాధించింది. ప్రజలు కూటమికి పట్టం కట్టారు. అయితే ఏపీలో ప్రభుత్వం ఏర్పడి పది రోజులు కూడా కాలేదు. కానీ రానున్న రోజుల్లో కొన్ని ధరలు పెరిగే అవకాశాలను కొట్టిపారేయలేమంటున్నారు ఉన్నతాధికారులు. ఇచ్చిన హామీలు అమలు కావాలంటే ఖచ్చితంగా ప్రజలపై భారం మోపాల్సిందే. అంతే తప్ప ఇప్పటికిప్పుడు సంపద సృష్టి సాధ్యం కాదు. అయితే కర్ణాటక, తెలంగాణ కంటే ఏపీకి ఒక విషయంలో అనుకూలత ఉంది. కర్ణాటక, తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలో ఉంది. అక్కడ కేంద్ర ప్రభుత్వం సహకరించకపోవచ్చు. ఇకపోతే ఉచితాలు ఇస్తామని చెప్తారు మన నాయకులు. ఉచితాలు ఎంతకాలంఇవ్వగలదు ఏ ప్రభుత్వమైనా? ప్రజలు ఎప్పుడూ ఉచితంగా వసతులు కల్పించమని అడగరు.కొన్ని సేవలు ఉచితంగా కల్పించటమనేది సంక్షేమానికి కట్టుబడి ఉన్న రాజ్యాంగంగా ప్రభుత్వాలు వాటంతట అవే ఏర్పాటు చేస్తుంటాయి.ఉదాహరణకు ప్రభుత్వ వైద్యశాలల్లో మెరుగైన వైద్యం ఉచితంగా అందించాలని కోరుకునేవారుంటారు. అలాగే ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన విద్యాబోధన ఉచితంగా అందించాలని కూడా కోరుకుంటారు కొన్నివర్గాల వారు. మన దేశంలో ఉన్న విచిత్రం ఏమంటే ప్రాథమిక విద్యకు ప్రైవేటు పాఠశాలల వైపు చూస్తాం; అదే ఉన్నత విద్యకు ప్రభుత్వ వ్యవస్థల వైపు చూస్తాం. ఉదాహరణకు గవర్నమెంటు కాలేజీలో డాక్టరు కోర్స్, ఇంజినీరింగ్ కోర్సులో ప్రవేశం పొందటం ప్రతిష్టాత్మకం. అదే ఎల్కేజీ దగ్గరి నుంచి ఇంటర్మీడియట్ వరకు ప్రైవేటు బడుల్లో చదవటం కోరుకుంటాం. ప్రభుత్వ బడుల్లో పరిస్థితిని మెరుగుపరిచే కార్యక్రమాన్ని మధ్యతరగతుల వారు పెద్దగా అభినందించరు. ఎందుకంటే వాళ్ల పిల్లలు ఆ బడులకు పోరు గనుక. ఈ దమన నీతి నుంచి మనిషి బయటపడాలి. మెరుగైన వైద్యం, మెరుగైన విద్య మౌలిక వసతుల కల్పనలో భాగంగా, అభివృద్ధి కార్యక్రమంగానే చూడాలి. ఎక్కువ మంది ప్రజలు మెరుగైన రవాణా సౌకర్యం కావాలనుకుంటారు కానీ, డొక్కు బస్సుల్లో గుంతల రోడ్లలో ఉచిత ప్రయాణం కోరుకోరు. ఇట్లాంటి హామీలను ప్రజలే తిరస్కరించాలి. ఇక్కడే ఓటరు విజ్ఞత తెలిసేది.ఇప్పుడు గనక మనం నోరు తెరవకపోతే వచ్చే ఐదేండ్లు ఐదు వేళ్లతో నోరు మూసుకోవాల్సిందే. ఇక్కడ ఏది కోరుకోవాలి? నోరెత్తి అడిగే స్వేచ్ఛా లేక నోరు మూసుకొని మౌనంగా ఉండే దౌర్భల్యమా? మనం స్వేచ్ఛను పరిరక్షించుకోవాలంటే మన ఓటును అమ్ముకోకూడదు. ప్రలోభం ఎంతటి బలమైనదైనా కూడా. ఓటుకు 500 ఇచ్చారనుకుందాం. అంటేఏడాదికి వంద. అదేనా మన ఓటు విలువ? అసలు మన ఓటుకు ఇంత అని విలువ కట్టగలమా?కానీ ఏపీలో టీడీపీ వల్లనే దేశంలో ఎన్డీఏ ప్రభుత్వం మనుగడ సాగిస్తుండటంతో కేంద్ర సహకారం లభిస్తుందని ఇప్పుడిప్పుడే పన్నుల భారం ఉండదన్న కామెంట్స్ వినపడుతున్నాయి. మొత్తం మీద మూడు రాష్ట్రాల్లో ముందు ముందు ఎన్నెన్ని రకాల పన్నులు వేస్తారో? ఏమేమి నిర్ణయాలు వెలువడుతాయోనన్న భయం ఇప్పుడు ప్రజలకు పట్టుకుంది.