సిరాన్యూస్, ఇంద్రవెల్లి
త్వరలో నూతన రేషన్ కార్డులు మంజూరు చేస్తాం : ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్
* అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇండ్లు ఇస్తాం
* అదనపు రేషన్ దుకాణాలు ప్రారంభం
గత 10సంవత్సరాలలో కెసిఆర్ హయాంలో ఒక్క నూతన రేషన్ కార్డు కూడా మంజూరు కాలేదని,దాని కారణంగా రైతు రుణమాఫీ కాలేదని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ పేర్కొన్నారు.గురువారం ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని ఆంజి,వాల్గొండ, హిరాపూర్,భీంజీతండా,పిట్టబొంగరం గ్రామాలలో నూతన అదనపు రేషన్ దుకాణాలను ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పేదల సంక్షేమ కోసం కృషి చేస్తుందన్నారు.త్వరలో కొత్త రేషన్ కార్డులను మంజూరు చేస్తామని అన్నారు.పేద కుటుంబం నుండి వచ్చిన తనకు పేద ప్రజల సమస్యలెంటో తెలుసని,గ్రామ ప్రజలు పడుతున్న కష్టాలను చూసి అదనపు రేషన్ దుకాణాలను మంజూరు చేశామని తెలిపారు.రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక కృషి చేస్తుందని అన్నారు.అసెంబ్లీ ఎన్నికలలో ఇచ్చిన మాట ప్రకారం ప్రతి హామీని నెరవేర్చామని తెలిపారు.మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో పాటు 500 రూపాయలకు గ్యాస్ అందించామన్నారు.ప్రతి ఇంటికి 200 యూనిట్ల ఉచిత కరెంటును అందిస్తున్నామని,గ్రామాలలో నెలకొన్న సమస్యలను దశలవారీగా పరిష్కరిస్తామని పేర్కొన్నారు.త్వరలో ఇంద్రవెల్లి నుండి వడగావ్ వరకు అదే విధంగా జెండా గుడా గ్రామం వరకు రోడ్డు వేస్తామని తెలిపారు.అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో వివిధ గ్రామ పటేల్లు, మాజీ సర్పంచ్లు, ఎంపీటీసీలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.