సిరా న్యూస్, ఆదిలాబాద్:
కే ఏ పాల్ కాదు.. కీ ప్లేయర్..
+ విమర్శకుల నోళ్లు మూయించిన కంది శ్రీనివాస రెడ్డి
+ 47724 ఓట్లతో సత్తా చాటిన వైనం
+ రాజకీయ అనుభవం లేకున్నా మూడో స్థానానికి
+ కంది గురించి పాజిటివ్గా చర్చించుకుంటున్న జనం
ఎన్నికల ప్రచారంలో ఆదిలాబాద్(Adilabad) జనాలు తరుచుగా విన్న పదం కే ఏ పాల్. ఎన్ఆర్ఐ, కాంగ్రేస్ పార్టి ఎమ్మెల్యే అభ్యర్థి కంది శ్రీనివాస రెడ్డిని(Kandi Srinivasa Reddy) కే ఏ పాల్, కమేడియన్ అంటూ ప్రత్యర్థులు సోషల్ మీడియా వేదికగా అపహాస్యం చేయడం అందరికి తెలిసిన విషయమే. అమెరికా నుండి వచ్చాడు.. కనీసం ఆదిలాబాద్లోని గ్రామాలు, కాలనీలు కూడ సరిగ్గా తెలియవని అవహేళన చేసేవారు. ఎలాంటి రాజకీయ అనుభవం లేకుండా రాజకీయాల్లోకి దిగిన కంది శ్రీనివాస రెడ్డికి ఘోర పరాజయం తప్పదని ప్రత్యర్థులు ప్రచారం చేసారు. కానీ ప్రత్యర్థుల విమర్శలన్నింటిని తిప్పి కొడుతూ.. కంది శ్రీనివాస్ రెడ్డి ధైర్యంగా ముందుకు సాగిన వైనం అందరినీ అశ్చర్య పరిచింది. బీజేపీలో చేరిన కొద్ది రోజుల్లోనే కాంగ్రేస్ పార్టీ తీర్థ పుచ్చుకోవడంతో, అతని రాజకీయ భవిష్యత్తు ప్రారంభం కాకుండనే ముగిసిపోయిందని చాలా మంది అనుకున్నారు. కానీ వీటన్నింటిని ఎంతో పాజిటివ్గా స్వీకరించిన కంది, ఈ రోజు ఆదిలాబాద్ రాజకీయాల్లో తనకంటూ ఒక ముద్ర వేసుకోవడం సక్సెస్ అయ్యారనే చెప్పవచ్చు. ఈ అసెంబీ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి బరిలో నిలిచిన ఆయన ఏకంగా 47724 ఓట్లు సాధించి స్వంత పార్టీ అభ్యర్థుల గత ఓట్ల రికార్దులను బ్రేక్ చేసి, విమర్శకులందరి నోళ్లు మూయించారు. రాజకీయాల్లో తలలు పండిన లీడర్లకు సైతం సాధ్యం కానీ ఓట్లను సాధించిన ఆయన ప్రస్తుతం ఆదిలాబాద్లో కీ ప్లేయర్గా నిలిచారు. ఇప్పటి లాగానే సేవా కార్యక్రమాలు కొనసాగిస్తూ, కొంచెం మాట తీరు మార్చుకొని ప్రజల్లో ఉంటే మాత్రం వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కందిని ఎదుర్కోవడం కష్టమేనని వివిద పార్టీల నాయకులు, ప్రజలు, విశ్లేషకులు చర్చించుకుంటున్నారు.
అయితే కంది శ్రీనివాస రెడ్డి కష్టం వృథా పోదని, కాంగ్రేస్ ప్రభుత్వం ఆయనకు మంచి పదవినిచ్చి అక్కున చేర్చుకోవడం ఖాయమని ఆయన సన్నిహితులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రజా సేవే లక్ష్యంగా రాజకీయాల్లోకి వచ్చిన కంది వెనుదిరిగి చూసేది లేదని, ప్రజల పక్షాన నిలబడటం ఖాయమని వారు కుండ బద్దలు కొట్టి చెబుతున్నారు.