సిరా న్యూస్, జైనథ్
పథకాల లబ్ది చేకూరేలా అధికారులు చర్యలు తీసుకోవాలి
* నూతన జిల్లా పాలనాదికారి రాజర్షి షా
* తహసీల్దార్, ఎంపిడివో కార్యాలయాలు తనిఖీ
అర్హులైన ప్రతిఒక్కరికి ప్రభుత్వ పథకాల లబ్ది చేకూరేలా అధికారులు చర్యలు తీసుకోవాలని నూతన జిల్లా పాలనాదికారి రాజర్షి షా అన్నారు. బుదవారం బాధ్యతలు స్వీకరించిన అనంతరం జిల్లా పాలనాధికారి జైనద్ మండలం తహసీల్దార్, ఎంపిడివో కార్యాలయాల లో ఆకస్మికంగా తనిఖీ చేశారు. ధరణి, ప్రజాపాలన దరఖాస్తుల డాటా ఎంట్రీ నీ పరిశీలించి దిశా నిర్దేశం చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ధరణి పెండింగ్ దరఖాస్తుల పరిష్కారానికి ప్రత్యేక డ్రైవ్ చేపట్టినట్లు తెలిపారు. దరఖాస్తుల క్షేత్ర పరిశీలన పారదర్శకంగా చేయాలన్నారు. అర్హత ఉన్న ప్రతి దరఖాస్తును ఆమోదించి, న్యాయం చేయాలన్నారు. తిరస్కరణ కు గురయిన దరఖాస్తు కు తగు కారణం పొందుపర్చాలన్నారు. మహాలక్ష్మి, గృహజ్యోతి పథకాల ద్వారా అర్హులైన వారందరూ ప్రయోజనం పొందేలా, అన్ని ఎంపిడివో, మునిసిపల్ కార్యాలయాల్లో ప్రజాపాలన సేవాకేంద్రాలు ఏర్పాటుచేసినట్లు తెలిపారు. ప్రజాపాలన కార్యక్రమం సందర్భంగా దరఖాస్తు చేసుకోలేక పోయిన అర్హులైన వారితో పాటు, దరఖాస్తులో సరైన వివరాలు నమోదు చేయని వారికోసం ప్రజాపాలన కేంద్రాలని, పనిదినాల్లో ఉదయం 10.30 గంటల నుండి సాయంత్రం 5.00 వరకు పనిచేస్తాయన్నారు. అంతకుముందు నూతన బాధ్యతలు చేపట్టిన జిల్లా పాలనాధికారి రాజర్షి షా ను ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తా, అదనపు కలెక్టర్ శ్యామలాదేవి, ట్రైనీ కలెక్టర్ , జిల్లా అధికారులు, రెవెన్యు సిబ్బంది పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు.