తిరుమలలో రికార్డ్ స్థాయి వానలు

సిరా న్యూస్,తిరుమల;
మిచౌంగ్ తుఫాన్ ప్రభావం ఏడుకొండలపై తీవ్రంగా చూపింది. గత నాలుగు రోజులుగా ఎడతెరపి‌‌ లేకుండా కురుస్తున్న వర్షానికి తిరుమలలో గత 24 గంటల్లో 100 మిల్లీ మీటర్ల వర్షపాతం‌ నమోదు కాగా, శేషాచలంలోని జలాశయాలు పూర్తిగా జలకళ సంతరించుకుంది. తుఫాన్ ప్రభావం తీవ్రతరం కారణంతో భారీగా వరద నీరు జలాశయాలకు చేరుకోవడంతో పూర్తి స్ధాయిలో నిండుకున్నాయి. దీంతో ఉదయం పాపవినాశనం, ఆకాశగంగ, గోగర్భం, కుమారధార, పసుపుధార డ్యాంల గేట్లను టిటిడి ఇంజనీరింగ్ విభాగం అధికారులు ఎత్తి వేయనున్నారు. పాపవినాశనం డ్యాంకు 697.14 మిల్లీ మీటర్ల నీటి మట్టం ఉండగా, ప్రస్తుతం 693.60 మిల్లీమీటర్ల వరదనీరు చేరుకుంది..‌ ఇక గోగర్భం డ్యాంకు 2894’0 నీటి మట్టం కలిగి ఉండగా, ప్రస్తుతం 2887 వరకూ వరద నీరు చేరుకుంది. ఆకాశగంగ డ్యాంకు 865.00 మిల్లీమీటర్ల వరకూ నీట్టమట్టం కలిగి ఉండగా ప్రస్తుతం 859.80 వరద నీరు చేరుకుంది. 898.24 నీటిమట్టం కలిగిన కుమారధార డ్యాంకు ప్రస్తుతం 896.20‌మిల్లీ‌లీటర్ల వరద నీరు చేరుకుంది.. 898.28 మిల్లీ‌‌లీటర్ల నీటిమట్టం కలిగిన పసుపుధార డ్యాంకు 895.90‌మిల్లీ లీటర్ల వరద నీరు చేరుకుంది. రాబోయే 214 రోజులకు జలాశయాల్లోని నీరు టీటీడీ అవసరాలకు ఉపయోగపడుతుంది.తుఫాను వలన ప్రస్తుతం కురుస్తున్న వర్షాల కారణంగా రెండు ఘాట్ రోడ్లలో పొగ మంచు దట్టంగా కమ్ముకుంది. ఆ కారణంగా వాహన రాకపోకులకు అక్కడక్కడ అంతరాయం కలుగుతోంది. ద్విచక్ర వాహనదారులు తమ ముందున వాహనాలు సరిగా కనపడక ప్రమాదాలు జరుగుతున్నాయి. వాహనాలు ప్రమాదాలకు గురి అయ్యే అవకాశం ఉండటంతో వర్షాలు తగ్గి సాధారణ స్థితి వచ్చేంత వరకు రెండు ఘాట్ రోడ్లలో ద్విచక్ర వాహనాలను ఉదయం 6 నుండి రాత్రి 8 వరకు మాత్రమే అనుమతిస్తాంమని టిటిడి ఆంక్షలు జారీ చేసింది. కనుక భక్తులు ఈ మార్పును గమనించి టిటిడికి సహకరించారని కోరింది. మిచౌంగ్ తుఫాన్ కారణంగా కపిలతీర్థం జలపాతంలో గంగమ్మ పరవళ్లు తొక్కుతోంది. భారీ స్థాయిలో కొండ ప్రాంతం నుంచి వరదనీరు కపిలతీర్థంలో ఉప్పొంగుతోంది. ఇలాంటి రమణీయమైన దృశ్యం చూడాలంటే ప్రతి ఏడాదిలో కార్తీక మాసం వరకు ఆగాల్సిందే. తిరుపతి సమీప ప్రాంతంలో కార్తీక మాసం లో సాధారణంగానే భారీ వర్షపాతం నమోదు అవుతాయి. ఇక తుఫాన్ కారణంగా నీటి ప్రవాహం మరింత పెరిగింది. కపిలతీర్థంలో ఉప్పొంగుతున్న జలపాతాన్ని చూసేందుకు భక్తులు., స్థానికులు ఎంతగానో ఆసక్తి చూపుతున్నారు. అక్కడి సెల్ఫీలు దిగి., బయట ప్రాంతాల్లో ఉన్న బంధుమిత్రులకు వీడియో కాల్ చేసి మరీ చూపుతున్నారు. కపిలతీర్థంలో నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. భక్తుల భద్రత దృష్ట్యా, పరిస్థితి సాధారణ స్థితికి వచ్చే వరకు పుష్కరిణి నీటిలో పుణ్యస్నానాలు ఆచరించే భక్తుల అనుమతిని టీటీడీతాత్కాలికంగా నిలిపివేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *