హైదరాబాద్ కు సెప్టెంబర్ టెన్షన్

సిరా న్యూస్,హైదరాబాద్;
తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరపిలేని వర్షాలతో జనజీవనం అస్తవ్యస్థమవుతోంది. ఇప్పటికే చాలా ప్రాంతాలు జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాలన్ని మునిగిపోయి.. ఇళ్లల్లోకి నీరు వచ్చేశాయి. ఇక.. హైదరాబాద్ నగరంలోని చాలా ప్రాంతాలు చెరువులను తలపిస్తున్నాయి. అయితే.. ఈరోజు నుంచి సెప్టెంబర్ నెల మొదలవుతున్న నేపథ్యంలో.. హైదరాబాద్ ప్రజలు గజగజా వణికిపోతున్నారు. ప్రతి ఏడాది సెప్టెంబర్ మాసం వచ్చిందంటే చాలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతుకులు వెల్లదీస్తున్న నగరవాసులకు.. ఈసారి కూడా అదే భయం వెంటాడుతోంది. ఇప్పటివరకు కేవలం వరుణుడి భయమే ఉన్న నగరవాసులకు.. సెప్టెంబర్ సెంటిమెంట్ కూడా తోడవటంతో.. ఎప్పుడు ఏం జరుగుతుందోనని.. వణికిపోతున్నాయి. దానికి కారణం.. గతంలో వాళ్లు చూసిన భీకర పరిస్థితులే.హైదరాబాద్‌లో వచ్చిన ఉపద్రవాలు చాలా వరకు సెప్టెంబర్‌లోనే వస్తుండటం.. నగరవాసుల్లో భయానికి కారణవుతున్నాయి. 1908వ సంవత్సరంలో భాగ్యనగరంలో ఉన్న మూసీ నది మహోగ్రరూపం దాల్చడంతో.. నగరంలోని సగభాగం తుడిచిపెట్టుకుపోవటం ఇప్పటికీ నగరవాసులను భయపెడుతూనే ఉంటుంది. ఆ వరదలు కూడా సెప్టెంబర్ నెలలోనే రావటం గమనార్హం. ఈ క్రమంలోనే.. 2000, 2016 సంవత్సరాల్లోనూ సెంప్టెంబర్ నెలలో కుండపోత వర్షాలు హైదరాబాద్‌ నగరాన్ని అతలాకుతలం చేశాయి. కేవలం 1908, 2000, 2016 మాత్రమే కాదు.. హైదరాబాద్ చరిత్రలో సెప్టెంబర్ మిగిల్చిన చేదు అనుభవాలు ఇంకెన్నో ఉన్నాయంటున్నారు నగరవాసులు.1591 నుంచి 1908 వరకు 14 సార్లు హైదరాబాద్ నగరాన్ని వరదలు ముంచెత్తాయి. 1631, 1831, 1903 సంవత్సరాల్లో భారీ వరదలతో భాగ్యనగరం అల్లాడిపోయింది. ఆ వరదలు.. పెద్ద ఎత్తున ధన నష్టంతో పాటు ప్రాణ నష్టం కూడా మిగిల్చాయి. 1908 సెప్టెంబరు వరదల్లో హైదరాబాద్ నగరంలోని ఏకంగా 2 వేల ఇళ్లు కొట్టుకుపోవటం.. 15 వేల మంది మృతి చెందటం.. 20 వేల మంది నిరాశ్రయులవటం.. ఇప్పటికీ నగర చరిత్రలో ఓ భీకర అనుభవమే. ఆ వరదల సమయంలో వారం రోజుల పాటు జనజీవనం స్తంభించిపోయింది.1631లో కుతుబ్‌ షాహీ ఆరో పాలకుడు.. అబ్దుల్లా కుతుబ్‌ షా కాలంలో వచ్చిన వరదలకు భవనాలు ధ్వంసం అయ్యాయి. మూసీ నది చుట్టు ప్రక్కల ఉన్న ఇళ్లు వరదలకు కొట్టుకుపోయాయి. వేలాది మంది నిరాశ్రయులైనట్టు చరిత్ర చెప్తోంది. 1831లో అసఫ్‌ జాహీ నాలుగో మీర్‌ ఫరుకుందా అలీఖాన్‌ నాసరుదౌలా పాలనా సమయంలోనూ.. భాగ్యనగరంలో భారీ వరదలు వచ్చాయి. ఆ సమయంలో.. నిర్మాణంలో ఉన్న చాదర్‌ఘాట్‌ వంతెన కొట్టుకుపోయింది. ఆరో నిజాం మీర్‌ మహబూబ్‌ అలీ పాలనా కాలంలోనూ.. 1903లో సెప్టెంబర్‌ నెలలోనే భారీ వర్షాలకు హైదరాబాద్ నగరం అల్లాడిపోయింది.ఇలా… 1968, 1984, 2000, 2007, 2016, 2020 సంవత్సరాల్లోనూ భారీ వర్షాలు కురిసి మూసీ నది ఉగ్రరూపం దాల్చింది. ఆయా సమయాల్లో జరిగిన బీభత్సానికి నగరమే సాక్షిగా నిలుచుంది. వేర్వేరు నెలల్లో వర్షాలు వచ్చినా.. సెప్టెంబర్‌లో వచ్చిన వర్షాలే బీభత్సం సృష్టిస్తుండటం గమనార్హం.అన్నింటా.. 1908వ ఏడాది మాత్రం హైదరాబాద్‌ చరిత్రలో ఎప్పటికీ మర్చిపోలేరు. సెప్టెంబరు 28వ తేదీ.. ఒక పీడ కలగా దాని ఆనవాళ్లు ఇప్పటికి భయపెడుతూనే ఉంటాయి. మూసీ నది ఏకంగా 60 అడుగుల ఎత్తున ప్రవహించి.. మహోగ్రరూపం దాల్చింది. 36 గంటల్లో 16 సెంటీమీటర్ల వర్షపాతం నమోదవడంతో.. హైదరాబాద్ ఆగమైపోయింది. మూసీ ప్రవాహం.. చాదర్‌ఘాట్‌ దాటి అంబర్‌పేట బుర్జు వరకు.. అటు చార్మినార్‌ దాటి శాలిబండ వరకు వరద పోటెత్తింది. ప్రాణాలు కాపాడుకునేందుకు వందల సంఖ్యలో ప్రజలు పేట్ల బుర్జుపైకి ఎక్కారు. కానీ.. మూసీ ఉద్ధృతికి పేట్లబుర్జు కూడా కొట్టుకుపోయి.. వందలాది మంది కొట్టుకుపోయాయి. ఆనాటి బీభత్సంలో.. వేల సంఖ్యలో నగరవాసులు మృత్యువాత పడ్డారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *