– జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్
పెద్దపల్లి;
ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మంచి విద్య అందించడంతో పాటు వారి మానసిక, శారీరక ఎదుగుదల జరిగేలా చూడాలని, విద్యార్థుల సమగ్రాభివృద్ధే లక్ష్యంగా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు. బుధవారం జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ ఎలిగేడు మండలంలోని సుల్తాన్ పూర్ జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించి కిచెన్ గార్డెన్ పరిశీలించి పాఠశాల పనితీరుపై ఉపాధ్యాయులతో సమీక్షించి పలు సూచనలు చేశారు. పాఠశాలలో చదువుతున్న విద్యార్థులతో జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ ముచ్చటిస్తూ మనకు అందుబాటులో ఉన్న అంతర్జాలం వినియోగించి సమాజంలో వస్తున్న మార్పులు, మార్కెట్ లో వస్తున్న కొత్త టెక్నాలజీ, నూతన ఉపాధి రంగాలు మొదలగు అంశాలను విద్యార్థులు తెలుసుకోవాలని కలెక్టర్ తెలిపారు.
జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ మాట్లాడుతూ పాఠశాలలో విద్యార్థులకు అందిస్తున్న పౌష్టికాహారం, కిచెన్ గార్డెన్ ఏర్పాటు, ఉన్నతి కార్యక్రమం, లక్ష్యం కార్యక్రమం అమలు గురించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. పాఠశాలలో చదివే విద్యార్థుల సమగ్రాభివృద్ధికి మనం బాధ్యత తీసుకోవాలని, ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ వహించి, మంచి ఫలితాలు సాధించాలని కలెక్టర్ సూచించారు. పాఠశాలలోని ఉపాధ్యాయులు ప్రణాళికా బద్ధంగా బోధన చేపట్టాలని, ప్రతి ఉపాధ్యాయుడు బోధించాల్సిన పాఠ్యాంశాలపై వార్షిక, నెలవారి ప్రణాళిక తయారు చేసుకుని టి.ఎల్.ఎం ప్రకారం కట్టుదిట్టంగా బోధన చేయాలని అన్నారు. విద్యార్థులకు వినూత్న రీతిలో బోధన చేస్తూ వారికి పాఠ్యాంశంలోని సారాంశం అర్ధమయ్యే విధంగా చూడాలని కలెక్టర్ సూచించారు. ప్రతి నెలలో మూడో శనివారం నిర్వహించే పేరెంట్, టీచర్స్ సమావేశంలో పాఠశాలలో జరిగే విద్యాబోధనపై డెమోనిర్వహించాలని, ఇంటి వద్ద పిల్లలు కొంత సమయం చదువుపై దృష్టి సారించే విధంగా తల్లిదండ్రులు శ్రద్ధ వహించాల్సిన అంశాన్ని వివరించాలని కలెక్టర్ సూచించారు. పాఠశాల విద్యార్థుల హాజరు శాతం పెరిగేలా ప్రణాళికా బద్ధమైన చర్యలు తీసుకోవాలని, వంద శాతం హాజరు లక్ష్యంగా పాఠశాల సిబ్బంది, ఉపాధ్యా యులు పనిచేయాలని, పాఠశాలకు రెగ్యులర్ గా హాజరు కాని విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ వహించి, పాఠశాలకు తరచుగా వచ్చే విధంగా చర్యలు చేపట్టాలని అన్నారు. పాఠశాల విద్యార్థులను త్వరలో సమీకృత జిల్లా కలెక్టరేట్ సందర్శన కోసం తీసుకొని రావాలని, జిల్లా యంత్రాంగం పని చేసే తీరు ను పరిశీలించి కొంత సమయం ఆహ్లాదకరంగా గడుపుతారని, దానికి అవసరమైన ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ పర్యటనలో జిల్లా కలెక్టర్ వెంట జిల్లా విద్యాశాఖ అధికారి డి.మాధవి, ప్రధానోపాధ్యాయులు, టీచర్లు, సంబంధిత అధికారులు, విద్యార్థిని, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.