కాంగ్రెస్ నయా ప్లాన్
సిరా న్యూస్,హైదరాబాద్;
రాబోయే నాలుగేళ్లలో ఒక్కో వర్గానికి దగ్గరవుతూ..వారిని కాంగ్రెస్ కట్టర్ ఓటు బ్యాంకుగా మార్చుకోవాలనే ప్లాన్ చేస్తోంది. అందుకే అలా ఎన్నికలు ముగిశాయో లేదో.. అప్పుడే మళ్లీ వచ్చే ఎన్నికల కోసం ప్లాన్లు రచిస్తోంది. యాదవ, కురుమ సామాజికవర్గాలను తమ వైపు తిప్పుకునేందుకు వ్యూహాలు అమలు చేస్తుంది.తెలంగాణలో యాదవ, కురుమ సామాజికవర్గాల ఓట్లు పెద్దసంఖ్యలో ఉంటాయి. గ్రామీణ ప్రాంతాల్లో కురుమ సామాజికవర్గానికి చెందిన వారు చాలా ఎక్కువగా ఉంటారు. అందుకే గత ప్రభుత్వంలో ఈ వర్గాలను ఆకట్టుకోవడం కోసం సబ్సిడీ కింద గొర్రెలు ఇచ్చారు. ఈ స్కీమ్తో మెజారిటీ కురుమ, యాదవ ప్రజలు బీఆర్ఎస్ వైపు మళ్లారు.కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక నిధుల కొరత కారణంగా గొర్రెల స్కీమ్ను తాత్కాలికంగా హోల్డ్లో పెట్టారు. దీంతో కాంగ్రెస్ సర్కార్ పట్ల యాదవ, కురుమలు కాస్త గుర్రుగా ఉన్నారు. దీంతో వారిని కాంగ్రెస్ వైపు తిప్పుకునేందుకు ప్రభుత్వ పెద్దలు సెంటిమెంట్ అస్త్రాన్ని ప్రయోగించారు. దీపావళి సందర్భంగా పట్టణాలలో యాదవ, కురుమలు సదర్ పండుగను ఘనంగా జరుపుకుంటారు. ఈ సదర్ను ఎక్కువగా హైదరాబాద్ సిటీలో నిర్వహిస్తుంటారు. ఈ సారి సదర్ను ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తోంది. కొన్ని నిధులు కూడా కేటాయించింది.రాష్ట్ర ప్రభుత్వం తరపున సదర్ను అధికారికంగా నిర్వహించడంతో పాటు.. సదర్ వేడుకలకు స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ఇప్పటి వరకు చరిత్రలో ఏ సీఎం కూడా సదర్ వేడుకకు ముఖ్యమంత్రి హోదాలో హాజరు కాలేదట. ఫస్ట్ టైం ఒక సీఎంగా రేవంత్ రెడ్డి సదర్ వేడుకకు హాజరయ్యారు. దీంతో ఆయా వర్గాలను మచ్చిక చేసుకోవడంతో పాటు వారిలో పాజిటివ్ అభిప్రాయం వచ్చేలే ప్రయత్నం చేశారు. యాదవ, కురుమ వర్గాలు కూడా సీఎం హాజరు కావడం.. సదర్ను రాష్ట్ర పండుగగా గుర్తించి నిధులు విడుదల చేయడంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు.మరోవైపు కులగణనకు శ్రీకారం చుడుతోంది సర్కార్. బీసీల కోసమే ఈ కులగణన చేపడుతున్నట్లు కూడా చెప్పకనే చెప్తోంది. బీసీల్లో కూడా యాదవులు, కురుమలు పెద్ద సంఖ్యలో ఉంటారు. గ్రామీణ ప్రాంతాల్లో కురుమలు ఓట్లు ఎక్కువగా ఉంటాయి. హైదరాబాద్లో యాదవులు ఎక్కువగా ఉంటారు. ఈ రెండు వర్గాలకు దగ్గరైతే అటు గ్రామీణ ప్రాంతంలో..ఇటు పట్టణాల్లో బలంగా ఉంటామని కాంగ్రెస్ ప్లాన్ చేస్తోంది. అంతేకాదు సదర్ను అధికారికంగా నిర్వహించడం వెనక మరో కారణం ఉందట. త్వరలో GHMC ఎన్నికలు రాబోతున్నాయి. గ్రేటర్లో జరగనున్న ఎన్నికల్లో యాదవ ఓటర్లను ఆకట్టుకునేందుకే సీఎం సదర్ను అధికారికంగా నిర్వహించారన్న టాక్ కూడా ఉంది. ఇలా ఏ చిన్న అంశాన్ని వదులుకోవడం లేదు సీఎం రేవంత్.
బీసీ కమిషన్ ఏర్పాటు
కులగణనపై తెలంగాణ సర్కార్ ఫోకస్ పెట్టింది. కులగణన కోసం డెడికేటెడ్ కమిషన్ ఏర్పాటు చేసింది. కమిషన్ ఛైర్మన్ గా మాజీ ఐఏఎస్ భూసాని వెంకటేశ్వర రావుని నియమించింది. సహాయకుడిగా ఐఎఫ్ఎస్ అధికారి బి. సైదులును ఎంపిక చేసింది. డెడికేటెడ్ కమిషన్ ఏర్పాటు చేస్తామని ప్రకటించిన 24 గంటల్లోనే ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఎల్లుండి నుంచే ప్రభుత్వం కులగణన చేపట్టనుంది. 1993 బ్యాచ్ కు చెందిన మాజీ ఐఏఎస్ అధికారి భూసాని వెంకటేశ్వరరావు.. 2019లో రిటైర్ అయ్యారు. టీటీడీ ఎక్స్ అఫిషియో మెంబర్ గా ఆయన పని చేశారు.ఈ నెల 6 నుంచి కులగణన చేపట్టబోతోంది ప్రభుత్వం. పూర్తి స్థాయిలో దానికి సంబంధించి రంగం సిద్ధం చేసింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల వ్యవహారానికి సంబంధించి ప్రత్యేక డెడికేటెడ్ కమిషన్ ఏర్పాటు చేయాలని హైకోర్టు సూచించిన నేపథ్యంలో రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు డెడికేటెడ్ కమిషన్ ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. 1993 బ్యాచ్ కి చెందిన మాజీ ఐఏఎస్ అధికారి భూసాని వెంకటేశ్వరరావును తెలంగాణ డెడికేటెడ్ కమిషన్ ఛైర్మన్ గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.ఇది ఏకసభ్య కమిషన్. కులగణనకు సంబంధించిన వ్యవహారంలో డెడికేటెడ్ కమిషన్ చాలా కీలకంగా వ్యవహరించబోతోంది. భవిష్యత్తులో కులగణనకు సంబంధించి బీసీ రిజర్వేషన్లు కల్పిస్తామని ప్రభుత్వం చెప్పింది. అయితే, కోర్టు చిక్కులు తలెత్తే అవకాశం ఉన్న నేపథ్యంలో న్యాయస్థానం సూచనలతో డెడికేటెడ్ కమిషన్ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 2019లో రిటైర్ అయిన వెంకటేశ్వరరావు గతంలో టీటీడీ ఎక్స్ అఫిషియో మెంబర్ గానూ పని చేశారు. మొత్తానికి ఇదొక కీలక నిర్ణయంగా చెప్పొచ్చు. గతంలో సీఐడీ, విపత్తుల నిర్వహణ స్పెషల్ సీఎస్ గానూ భూసాని వెంకటేశ్వరరావు పని చేశారు. సీనియర్ ఐఏఎస్ అధికారిగా గుర్తింపు పొందారు. ఈ క్రమంలో రేవంత్ ప్రభుత్వం ఆయనకు కీలక బాధ్యతలు అప్పగించింది.