Telangana writers Zeeguru Ravinder: కాళోజీ అడుగుజాడల్లో నడవాలి : తెరవే జిల్లా అధ్యక్షులు జీగురు రవీందర్

సిరా న్యూస్, ఓదెల
కాళోజీ అడుగుజాడల్లో నడవాలి : తెరవే జిల్లా అధ్యక్షులు జీగురు రవీందర్
* ట్రినిటీ డిగ్రీ కళాశాల విద్యార్థులకు వ్యాసరచన పోటీలు

కాళోజీ అడుగుజాడల్లో నడవాలని తెరవే జిల్లా అధ్యక్షులు జీగురు రవీందర్ అన్నారు. శనివారం తెలంగాణ రచయితల వేదిక పెద్దపెల్లి జిల్లా ఆధ్వర్యంలో “కాలోజీ జయంతి” సందర్భంగా ట్రినిటీ డిగ్రీ కళాశాల విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించారు. పోటీలో 100 మంది విద్యార్థులకు పైగా పోటీల్లో పాల్గొన్నారు.గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. అనంతరం తెరవే జిల్లా అధ్యక్షులు జీగురు రవీందర్ ,ప్రధాన కార్యదర్శి జినుకల వెంకటేష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో జీగురు రవీందర్ మాట్లాడుతూ మనిషి చనిపోయినా కూడా బ్రతకాలంటే సాహిత్యం ఒకటే మార్గం అన్నారు. తెలంగాణ కోసం అమరులైన వారందరిని గుర్తు చేస్తూ వారి అడుగుజాడల్లో నడవాలని, విద్యార్థులు కవితలు కథలు రాయడం అలవాటు చేసుకోవాలని, నేటి తరం వారిని ఆదర్శంగా తీసుకొని తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల్ని కాపాడుతూ వాటిని ముందుకు తీసుకెళ్లాలని కోరారు. తెరవే ప్రధాన కార్యదర్శి జినుకల వెంకటేష్ మాట్లాడుతూ నేటితరం సెల్ఫోన్లకు ఆకర్షితులు కాకుండా పుస్తకాల వైపు దృష్టి సారించాలని ,సమాజాన్ని చదవాలని, సమాజంలో మీకంటూ ఒక స్థానాన్ని ఏర్పాటు చేసుకోవాలని కాళోజీ చెప్పినట్లుగా బడి పలుకుల భాష కాకుండా పలుకుబడుల భాషను ఎంచుకోవాలని కోరారు. తెరవే రాష్ట్ర కార్యదర్శి బుర్ర తిరుపతి మాట్లాడుతూ చావు నీది పుట్టుక నీది బ్రతుకంతా తెలంగాణదని కాళోజి గురించి చెప్పారు. తెలంగాణ ఉద్యమానికి ఉద్యమకారులకు ఎంతో స్ఫూర్తిని ఇచ్చారని అలాంటి వారి జయంతులు జరుపుకోవడం మనం వారికి ఇచ్చే నిజమైన నివాళి అన్నారు. ట్రినిటీ డిగ్రీ కళాశాల వైస్ ప్రిన్సిపాల్ నీతారెడ్డి మాట్లాడుతూ కాళోజీకి వారి తల్లిదండ్రులు జన్మనిస్తే కాళోజీ అన్న రామేశ్వరరావు తనని 70 సంవత్సరాలు భుజాలపై మోసారని, నేటి తరం సున్నితమైన కుటుంబ సంబంధాలను అలవాటు చేసుకొని వాటిని పరిరక్షించాలని కోరారు. “తెలంగాణ అస్తిత్వ పోరాటంలో కాళోజి పాత్ర” వ్యాసరచన పోటీల లో కే. అక్షయ ప్రథమ బహుమతి, ఎస్. రమ్య ద్వితీయ బహుమతి, యు. మనూష తృతీయ బహుమతిని గెలుచుకున్నారు. బహుమతులు గెలుచుకున్న విద్యార్థులకు తెలంగాణ రచయితల వేదిక తరపున ట్రినిటీ డిగ్రీ కళాశాల తరపున అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపాల్ నీతా రెడ్డి, అశ్విని తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *