ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు
సిరా న్యూస్,హైదరాబాద్;
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న కుల గణన సర్వే పై బి.ఆర్.ఎస్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కీలక వ్యాఖ్యలు చేశారు. సర్వేకు తమ పార్టీ మద్దతు ఉంటుందని కానీ బీసీ, ఎస్.సి, ఎస్.టీ ప్రజలకు అన్యాయం జరిగితే సహించేది లేదని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. భారతదేశంలో మొట్టమొదటిసారిగా బీసీ కులగణనకు తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వం ప్రారంభించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. సర్వేకు సంబంధించి ప్రజల్లో నేతల్లో ఎన్నో అనుమానాలు ఉన్నాయని వాటిని నివృత్తి చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంతో పాటు క్యాబినెట్ పైన ఉందన్నారు. సర్వే పేరిట 76 ప్రశ్నలతో కూడిన వివరాలను అడుగుతున్నారని ఆదాయం ఎక్కువగా ఉంటే తెల్ల రేషన్ కార్డు తో పాటు ఇతర ప్రభుత్వ పథకాలను తీసేసే విధంగా సర్వే ఉంటే మాత్రం సహించేది లేదని వ్యాఖ్యానించారు. హడావిడిగా సర్వే పూర్తి చేయాల్సిన అవసరం లేదని సమయం తీసుకొని సర్వే ని పూర్తి చేస్తే అందరికీ ఉపయోగంగా ఉంటుందని తెలిపారు.అనంతరం ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.