సిరాన్యూస్,బేల:
బేల కు చేరుకున్న అయోధ్య రాములోరి అక్షింతలు..
భక్తి శ్రద్ధలతో అక్షింతల శోభయాత్రగా
రాములోరి జన్మభూమి ట్రస్ట్ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా పంపిణీ చేస్తున్న అయోధ్య రామాలయం అక్షింతలు అదిలాబాద్ జిల్లా బేలకు చేరుకున్నాయి. అక్షింతలతో వచ్చిన భక్తులకు స్థానిక హనుమాన్ భక్తులు అంబేద్కర్ చౌరస్తా వద్ద ఘన స్వాగతం పలికారు. అక్షింతలను శోభయాత్రగా మండల కేంద్రంలోని అశోక్ నగర్ హనుమాన్ దేవాలయానికి తీసుకెళ్లారు. స్థానిక హనుమాన్ భక్తులు భాజా భజంత్రీలు, మంగళహారతులు, భజన పాటల మధ్య అయోధ్యలోని శ్రీరాముని పాదుకలను తాకిన అక్షింతలు, కరపత్రాలు, అయోద్య రామాలయం పటంతో భారీ ఊరేగింపు నిర్వహించి, అయంలో భద్రపరిచారు. అక్షింతలను,ఫోటోలను మండలంలోని పలు గ్రామాల ప్రజలకు వచ్చే సంవత్సరం 1వ తేది నుండి పంపిణీ చేయనున్నట్లు వారు తెలిపారు. భక్తులంతా ఆ అక్షింతలను, ఫోటోలను పూజ గదిలో పెట్టుకొని, ఉదయం తలపై చల్లుకొని ఇంటిల్లిపాది శ్రీ రాముని ఆశీస్సులు పొందాలని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు శ్రీనివాస్ గుండెవార్, ఎంపీటీసీ జ్యోతి సంజయ్, నాయకులు అనిల్ గుండెవార్, అనోజ్, శ్రీకాంత్, నారాయణ్, రాము, హనుమాన్ భక్తులు,తదితరులు పాల్గొన్నారు.