సిరా న్యూస్,సామర్లకోట
ఏలేరు ఉగ్రరూపం…
పలుచోట్ల కాలువలకు గండ్లు
అప్రమత్తమవుతున్న అధికారులు
ఎడతెరపి లేని వర్షాలతో ఏలేశ్వరం ప్రాజెక్టు కు అధిక మొత్తంలో వరద జాలాలు చేరడంతో ప్రాజెక్టు గేటులను ఎత్తి వేల సంఖ్యలో క్యూసెక్కుల నీటిని ఇరిగేషన్ అధికారులు విడుదల చేశారు. దానితో ప్రాజెక్టు పరిధిలో ఉన్న ఏలేరు కాలువలన్నీ ఉగ్రరూపం దాల్చాయి. పలుచోట్లా ఏలేరు కాలువలకు గండ్లు పడగా వరద జలాలు పరివాహక ప్రాంతాల లోతట్టు గ్రామాల్లోకి చిచ్చుకొని వెళుతున్నాయి. దానితో పలు గ్రామాల ప్రజలు భయ ఆందోళనలకు గురవుతున్నారు. జిల్లా కలెక్టర్ ముందస్తు ఆదేశాలతో ఏలేరు పరివాహక ప్రాంతాల్లో అధికారులు ఆదివారం సాయంత్రం నుంచి గ్రామాల్లో అప్రమత్తంగా ఉన్నారు. ఏలేరు జలాలు విడుదల చేసిన సందర్భంగా పెద్దాపురం కాండ్రకోట గ్రామంలో దబ్బ కాలువపై నిర్మించిన కాజ్ వే వరద ఉదృతికి కొట్టుకు పోయింది. దానితో కట్టమూరు, జె తిమ్మాపురం, కాట్రావులపల్లి గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఇంకా కిర్లంపూడి మండలం రాజుపాలెం గ్రామం వద్ద ఏలేరు కాలువకు గండి పడటంతో వరద జలాలు భారీగా సమీపంలోని కాలనీలోకి చేరుకోగా అక్కడి కుటుంబాలను పునరావాస కేంద్రాలకు తరలించే చర్యలు అధికారులు వేగవంతం చేశారు. ఇంకా సామర్లకోట మండలం వికె రాయపురం గ్రామం మీదుగా వెళుతున్న ఏలేరు కాలువకు ఉన్నత పాఠశాల సమీపంలో గండి పడే అవకాశం ఉన్నదని అక్కడి ప్రజలు ఆందోళన చెందుతున్నారు కాలువగట్టు బలహీనంగా ఉన్న కారణంగా అధికారులు తక్షణం దానిని పరిశీలించాలని ప్రజలు కోరుతున్నారు. కాగా కాండ్రకోట మీదుగా వస్తున్న ఏలేరు కాలువ పాత పెద్దాపురం, వడ్లమూరు వంతెన మీదుగా సామర్లకోట నుంచి కాకినాడకు చేరుకొని సముద్రంలో కలుస్తుండగా ప్రాజెక్టు నుంచి వదిలిన వరద జలాల కారణంగా ఎక్కడికక్కడే కాలువలన్నీ పొంగి ప్రవహిస్తున్నాయి. దానితో ఇప్పటికే వందలాది ఎకరాల్లో పంటపొలాలు నీట మునగగా క్రమంగా పలు లోతట్టు ప్రాంతాల్లోకి వరద జలాలు చొచ్చుకొస్తున్నాయి. సోమవారం రాత్రికి వరద జలాలు మరింత పెరిగే అవకాశలున్నట్టు అధికారులు అంచనా వేస్తున్నారు. వరద పరిస్థితులపై పెద్దాపురం మండల పరిధిలో పెద్దాపురం ఆర్డివో జె సీతా రామారావు, ఎస్ ఐ మౌనిక లు రెవెన్యూ అధికారులతో కలసి పరిశీలిస్తుండగా సామర్లకోట పట్టణం, మండలంలో తహసీల్దార్ చంద్రశేఖర్ రెడ్డి సిబ్బందితో పర్యటించి లోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. అలాగే రెండు మండలాల్లో వరదల కారణంగా పంటనష్టం పై మండల వ్యవసాయ అధికారులు పర్యటిస్తూ నష్టాన్ని అంచనా వేస్తున్నారు. కాగా సామర్లకోట పట్టణంలో ఏలేరు వరద ఉదృతి ని తెలుగుదేశం పార్టీ నాయకులు పరిశీలించారు. పిఠాపురం రోడ్డులు దెబ్బతింటున్నాయి.పెద్దయేరు వంతెన, అక్కడి డ్యామ్ ను, ఏలేరు కాలువను ఆనుకుని ఉన్న టిడ్ కో గృహ సముదాయాలను నాయకులు అడబాల కుమారస్వామి, బడుగు శ్రీకాంత్, కంటే జగదీశ్ మోహన్, యార్లగడ్డ రవిచంద్ర ప్రసాద్, బలుసు వాసు, అండుగుల జార్జి చక్రవర్తి, గొల్లపల్లి కామరాజు, తదితరులు పరిశీలించి అప్రమత్తంగా ఉండాలని కాలనీ ప్రజలను, రైతులకు సూచించారు. ఇంకా ప్రమాదాలకు అవకాశం ఉన్న అన్ని ప్రాంతాల్లో రెవెన్యూ అధికారులు పహారా నిర్వహిస్తూ ఎప్పటికప్పుడు సమాచారన్ని అధికారులకు అందిస్తున్నారు.