-మహిళలు,చిన్న పిల్లల పట్ల మర్యాదగా నడుచుకోవాలి
-యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి
-మంథని సర్కిల్ ఇన్స్పెక్టర్ బొల్లపల్లి రాజు
సిరా న్యూస్,మంథని;
గ్రామాలలో ఎవరైనా అసాంఘిక చర్యలకు పాల్పడితే అట్టి వారి పై చట్టరీత్యా కఠిన చర్యలు తప్పవని మంథని సర్కిల్ ఇన్స్పెక్టర్ బొల్లపల్లి రాజు అన్నారు.
మంథని మండలంలోని గుంజపడుగు గ్రామంలో రామగుండం కమిషనర్ ఎం శ్రీనివాసులు ఆదేశానుసారం మంథని సర్కిల్ ఇన్స్పెక్టర్ బొల్లపల్లి రాజు, మంథని ఎస్సై డ్యాగల రమేష్ ఆధ్వర్యంలో మంథని సర్కిల్లోని పోలీస్ సిబ్బందితో శనివారం కార్టన్ అండ్ సెర్చ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీస్ అధికారులు గ్రామ ప్రజలతో సమావేశం నిర్వహించి గ్రామంలోని స్థితిగతులను అడిగి తెలుసుకోన్నారు. అంతేకాకుండా సరైన పత్రాలు లేనటువంటి ద్విచక్ర వాహనాలను గుర్తించి వాటిపైన చాలాన్లు విధించారు. ఈ సందర్భంగా సిఐ రాజు మాట్లాడుతూ గ్రామంలోని యువత గంజాయి మరియు మత్తు పదార్థాల వంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని అన్నారు.వాటి వల్ల కలిగే అనర్ధాల గురించి వివరించి చెప్పారు. గంజాయి ఇతర మత్తు పదార్థాలు ఎవరైనా సేవించిన విక్రయించిన వారి వివరాలను పోలీసు వారికి చేరవేయాలని కోరారు. మైనర్ పిల్లలకు వాహనాలు ఇచ్చిన వారిపైన కూడా కఠినమైన చర్యలు తీసుకోబడతాయని అన్నారు. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థిని విద్యార్థులు ఎటువంటి గొడవలలో తలదూర్చకూడదని సూచించారు. సోషల్ మీడియాను వేదికగా చేసుకొని ఎవరైనా అనుచిత పోస్టులు పెట్టిన అట్టి వారి పైన చట్టరీత్యా చర్యలు తీసుకుంటామన్నారు. మహిళల పట్ల చిన్న పిల్లల పట్ల మర్యాదగా నడుచుకోవాలని సూచించారు. మీకు ఎటువంటి సమాచారం తెలిసిన తక్షణమే 100 నెంబర్ కు కాల్ చేసి పోలీస్ ల సహాయం తీసుకోవాలని ఆయన సూచించారు. అనంతరం మంథని ఎస్ఐ డ్యాగల రమేష్ సైబర్ నేరాల పట్ల అవగాహన కల్పించారు. మీకు తెలియని ఏదైనా ఫోన్ నెంబర్ నుండి కాల్స్ కానీ మెసేజ్ కానీ వచ్చి మిమ్మల్ని ఏవైనా ప్రలోభాలకు గురి చేసిన వెంటనే మీరు 1930 నెంబర్ కు కాల్ చేసి పోలీసు వారి సహాయం పొందాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో రామగిరి ఎస్సై చంద్రకుమార్, ముత్తారం ఎస్సై నరేష్ లతో పాటు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.